నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ మధుబని రైల్వే స్టేషన్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఓ ఖాళీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బోగీ మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ప్లాట్ఫామ్ నంబర్-3పై షంటింగ్ పనుల నిమిత్తం రైలు నిలిచి ఉన్న సమయంలో ప్రమాదం జరిగింది. దీంతో అధికారులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మధుబని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి.
రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు పది అగ్నిమాపక వాహనాలు రైల్వే స్టేషన్కు చేరుకున్నాయి. గంటపాటు శ్రమించి వారు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై సమస్తిపూర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ జ్యోతి ప్రకాశ్ మిశ్రా స్పందించారు. రైల్వే యంత్రాంగం ప్లాట్ఫామ్ ప్రాంతాన్ని ఖాళీ చేయించి విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



