దీపావళికి బాణసంచా నిషేధం..

నవతెలంగాణ న్యూఢిల్లీ: రసాయనాలతో కూడిన బాణసంచా(firecrackers) నిషేధం కేవలం దేశ రాజధాని ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని.. అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపింది. అతి తక్కువ కాలుష్య ఉద్గారాలు, వాయు, శబ్ధ కాలుష్యం విడుదల చేసే పర్యావరణహిత బాణసంచాను (Green crackers) మాత్రమే అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని పేర్కొంది. పర్యావరణాన్ని కాపాడటం ప్రతిఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పండుగల సమయంలో వాయు, శబ్ధ కాలుష్యాన్ని తగ్గించడంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసేలా రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీన్ని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కొత్తగా ఎటువంటి ఆదేశాలు అవసరం లేదని తెలిపింది. బాణసంచాలో బేరియం సహా.. నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని.. వాటిని నిర్దిష్టంగా గమనించాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
బాణసంచాలో నిషేధిత రసాయనాలను ఉపయోగించరాదని 2021లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉందని స్పష్టం చేసింది. వాటిని కూడా దీపావళి వంటి పర్వదినాల్లో రాత్రి 8గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే కాల్చుకోవచ్చని తెలిపింది. ఏదైనా నిషేధిత రసాయనాలతో నిర్దిష్ట ప్రాంతంలో తయారు చేయడం, విక్రయించడం, ఉపయోగిస్తున్నట్టు తేలితే సంబంధిత రాష్ట్రాలే బాధ్యులని స్పష్టం చేసింది.

Spread the love