గ్రామీణ భారతంలో వ్యాపారాలను నిర్మిస్తూ, జీవనోపాదులను, సమాజాలను మారుస్తున్నారు ఈ మహిళా పారిశ్రామికవేత్తలు. గ్రామీణ ప్రాంతాలలోని సవాళ్లను సుస్థిర వృద్ధికి అవకాశాలుగా కల్పిస్తున్నారు. థార్ ఎడారి నుండి కేరళ కొండల వరకు గ్రామ ఆర్థిక వ్యవస్థలను బలపరుస్తున్నారు. ఒంటె పాలు, వ్యర్థ పాల నుండి కొబ్బరి చిప్పలు, దేశీయ సుగంధ ద్రవ్యాలు, సాంప్రదాయ చేతివృత్తుల వరకు విభిన్న వనరులను ఉపయోగించి ఆదాయం పొందుతున్నారు. గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు తీసుకువెళుతూ, రైతులు, కళాకారులు, పశుపోషకులకు ఆదాయ అవకాశాలను సృష్టిస్తున్న ఆ మహిళా పారిశ్రామికవేత్తల కృషి గురించి మరిన్ని విశేషాలు…
ఆకృతి శ్రీవాస్తవ – బహుళ నాచురల్స్
రాజస్థాన్లోని థార్ ఎడారిలో సాంప్రదాయ పశుపోషణను ఒక సుస్థిరమైన, మార్కెట్తో అనుసంధానించబడిన వ్యాపారంగా మార్చడంలో, మరింత మెరుగైన జీవనోపాధిని కల్పించడంలో ఆకృతి శ్రీవాస్తవ బహుళ నాచురల్స్ను స్థాపించారు. ఇది బికనీర్, జైసల్మేర్, జైపూర్లలో 4,000కు పైగా పశుపోషక కుటుంబాలతో కలిసి పనిచేస్తుంది. ఇది ఓ మహిళా కేంద్రంగా మూడు విభాగాలుగా నడుస్తుంది. ఒంటె పాల ఉత్పత్తులు, దేశీయ రాఠీ ఆవు పాల ఉత్పత్తులు అలాగే వ్యవసాయ ఉత్పత్తులు. సహజంగా తయారు చేసిన ఒంటె పాల చీజ్, బిలోనా నెయ్యి, నల్ల గోధుమ పిండి, కోల్డ్-ప్రెస్డ్ నూనెల వంటి ఉత్పత్తులతో పాటు ఈ సంస్థ మెరుగైన ముడిసరుకులు, గృహ బయోగ్యాస్ యూనిట్ల వంటి స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తి చేస్తూ స్థానిక ఉపాధిలో పెట్టుబడి పెడుతుంది. దీని కార్మికులలో 95% మంది అదే గ్రామాలకు చెందిన యువతే. బికనీర్లో బహుళ సంస్థ తాజా పాలు, నెయ్యి, చీజ్, పనీర్, కోల్డ్-ప్రెస్డ్ నూనెలు, పిండిని డోర్స్టెప్ డెలివరీ ద్వారా నేరుగా స్థానిక కుటుంబాలకు అందిస్తుంది. స్థానికంగా మాత్రమే కాకుండా ఈ బ్రాండ్ తన డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా భారతదేశం అంతటా వినియోగదారులను చేరుకుంటుంది.
ప్రేరణా అగర్వాల్, శ్వేతాంబర ఉజ్జయిన్ – సమాఖ్య సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్
రాజస్థాన్లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని గ్రామాలలో పనిచేస్తున్నప్పుడు, గొర్రెలను పెంచుతున్న కుటుంబాలు ముతక ఉన్ని నుండి ఎలాంటి ఆదాయం పొందడం లేదని, తరచుగా దానిని కిలోగ్రాముకు రూ. 20 కంటే తక్కువకు అమ్ముతున్నారని లేదా పూర్తిగా పారవేస్తున్నారని ప్రేరణా అగర్వాల్ తెలుసుకుంది. సహ-వ్యవస్థాపకులు శ్వేతాంబర ఉజ్జయిన్, డానిష్ చౌదరిలతో కలిసి దీన్ని ఒక సుస్థిర వ్యాపారంగా మార్చడానికి ఆమె 2022లో సమాఖ్య సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ను స్థాపించారు. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన దానికి ఇప్పుడు ఓ విలువను అందించారు. నేడు సమాఖ్య సంస్థ రాజస్థాన్ వ్యాప్తంగా 500కు పైగా పశుపోషణ కుటుంబాలతో కలిసి పనిచేస్తోంది. అలాగే మగ్రా పశుపాలక్ కేంద్రాల ద్వారా ఒక వికేంద్రీకృత సరఫరా వ్యవస్థను నిర్మించింది. ఈ కేంద్రాలు గొర్రెల ఉన్ని కత్తిరించడం, పశువైద్య సహాయం, ఉన్ని సేకరణను అందిస్తాయి. ఈ సంస్థ తన ప్రాసెసింగ్ యూనిట్లలో 35 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడ ఉన్నిని వేరు చేసి, ఉన్ని రోల్స్, ఫెల్ట్ షీట్లు తయారు చేస్తున్నారు. దీని ఉత్పత్తులను పాఠశాలలు, సామాజిక కేంద్రాలలో ఉపయోగిస్తున్నారు. ఇది స్థానికంగా ఉపాధిని అందించి ఆదాయాన్ని అందిస్తుంది. అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థలో మహిళలు, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ గ్రామీణ జీవనోపాధిని పునరుద్ధరిస్తుంది.
మేఘా ఫన్సల్కర్ – టిస్సర్ ఆర్టిసన్ ట్రస్ట్
‘నేయడం’ అని అర్థం వచ్చే ‘టిస్సర్’ అనే పదం నుండి పుట్టిన ‘టిస్సర్ ఆర్టిసన్ ట్రస్ట్’ ద్వారా మేఘా ఫన్సల్కర్ మరింత పటిష్టమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న హస్తకళాకారుల పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కృషి చేస్తున్నారు. ఈ సంస్థ ఉత్పత్తి ఆవిష్కరణ, వైవిధ్యీకరణపై దృష్టి పెడుతుంది. హస్తకళాకారులతో సంబంధాలను బలోపేతం చేయడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. అలాగే సాంప్రదాయ చేతివృత్తులను పరిరక్షిస్తూనే స్థిరమైన జీవనోపాధిని సృష్టించడానికి సమగ్రమైన క్లస్టర్ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తుంది. 2015లో ప్రారంభమైనప్పటి నుండి టిస్సర్ ఉత్పత్తిదారుల సమూహం లక్షకు పైగా హస్తకళాకారులపై ప్రభావం చూపింది. మహిళా హస్తకళాకారుల స్థిరమైన వృద్ధి, ఆర్థిక స్వాతంత్ర్యంపై దృష్టి సారిస్తుంది. నేడు టిస్సర్ అనేక గ్రామీణ క్లస్టర్లలోని 1,000 మందికి పైగా హస్తకళాకారులు తయారు చేసిన 1,000కి పైగా ఉత్పత్తులను అనుసంధానిస్తోంది. దీని కార్యక్రమాలలో మహిళా కళాకారుల ప్రాజెక్టులు, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్ట్, గ్రాస్రూట్స్ రీజినల్ ఆర్టిసాన్స్ మూవ్మెంట్, ప్రాజెక్ట్ రివైవ్ వంటివి ఎన్నో ఉన్నాయి.
మరియా కురియాకోస్ – తెంగా కోకో
ఎక్కడో చదువుకున్న తర్వాత ఓ స్థిరమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి తన సొంత రాష్ట్రమైన కేరళకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు మరియా కురియాకోస్. రాష్ట్రంలో విరివిగా లభించే కొబ్బరి చిప్పలను పారవేయడం, తగలబెట్టడం చూసిన ఆమెకు తెంగా కోకో ఆలోచన పుట్టింది. పాలక్కాడ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కొబ్బరి చిప్పలను ఉపయోగకరమైన, అలంకరణ జీవనశైలి ఉత్పత్తులుగా మారుస్తుంది. ప్రస్తుతం తెంగా కోకో భారతదేశంలోనే అతిపెద్ద కొబ్బరి చిప్ప ఉత్పత్తుల తయారీదారుగా ఎదిగింది. దీని ఉత్పత్తులలో వంటసామాగ్రి, గృహాలంకరణ నుండి బహుమతి ఉత్పత్తుల వరకు 110కి పైగా రకాలు ఉన్నాయి. ఈ సంస్థ కేరళ వ్యాప్తంగా మహిళలు, నైపుణ్యం గల కళాకారులతో కలిసి పనిచేస్తూ, వ్యవసాయ వ్యర్థాలను ప్రీమియం ఉత్పత్తులుగా మార్చి వాటిని భారతదేశం అంతటా విక్రయించడంతో పాటు యూరోపియన్ మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది. 2024లో ఈ స్టార్టప్ కేరళ-తమిళనాడు సరిహద్దులోని వేలంతవళంలో తన సొంత తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లో 26 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరు కొబ్బరి చిప్పలను కత్తిరించడం, ఆకృతి ఇవ్వడం నుండి సాండింగ్, పాలిషింగ్, ఫినిషింగ్, ప్యాకేజింగ్ వరకు తయారీ ప్రక్రియలోని ప్రతి దశలోనూ భాగమవుతారు.
అను సన్నీ – గ్రామ్య
అను సన్నీ, భావేష్ సవారియా స్థాపించిన గ్రామ్య అనేది కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న చిన్న రైతులతో కలిసి పనిచేస్తుంది. మధ్యవర్తులను తొలగించి రైతులకు మెరుగైన రాబడిని అందించడం ద్వారా దేశీయ సుగంధ ద్రవ్యాలను నేరుగా సేకరిస్తుంది. ఈ సంస్థ మిరియాలు, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కోకో, కాఫీ, పసుపు వంటి దేశీయ రకాలపై దృష్టి పెడుతుంది. అలాగే సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ, సాంప్రదాయ సాగు విధానాలను పరిరక్షిస్తుంది. ఇది గతంలో విలువ లేని చిరుధాన్యాలు, కరివేపాకు, మలబార్ చింతపండు వంటి చిన్న పంటలను కూడా సేకరించడం ప్రారంభించింది. గ్రామ్య ఇటీవల యాలకుల పరిశోధనా సంస్థ నుండి కొత్తగా అభివృద్ధి చేయబడిన ICRI-10 అనే పచ్చి యాలకుల రకాన్ని వాణిజ్యీకరించిన మొదటి సంస్థగా నిలిచింది. ఈ సంస్థ రెండు ప్రాసెసింగ్ కేంద్రాలను నిర్వహిస్తుంది. గ్రామంలోని ఒక ప్రాథమిక యూనిట్లో సుగంధ ద్రవ్యాలను ఎండబెట్టి, ప్రాథమిక ప్రాసెసింగ్ చేస్తారు. మరొక కేంద్ర కేంద్రంలో వాటిని వేరుచేసి, గ్రేడ్ చేసి, శుభ్రపరిచి, ప్యాకేజీ చేస్తారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే.
సలీమా



