50వ టెస్టులో పంత్ ఫిఫ్టీ
న్యూ చంఢీగడ్లో భారత బ్యాటర్లు శతక మోగ మోగించారు. ఓపెనర్ కెఎల్ రాహుల్ (100), కెప్టెన్ శుభ్మన్ గిల్ (103 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. రిషబ్ పంత్ (50 నాటౌట్), సాయి సుదర్శన్ (81) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. భారత టాప్-5 బ్యాటర్లలో నలుగురు ఫిఫ్టీ ప్లస్ పరుగులు చేయటంతో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు తొలి రోజు ఆతిథ్య భారత్ పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 368/3తో నిలిచింది.
నవతెలంగాణ-న్యూ చంఢీగడ్
శుభ్మన్ గిల్ (103 నాటౌట్, 143 బంతుల్లో 1 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగగా, రిషబ్ పంత్ (50 నాటౌట్, 70 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్ కెఎల్ రాహుల్ (100, 165 బంతుల్లో 11 ఫోర్లు), నం.3 బ్యాటర్ సాయి సుదర్శన్ (81, 104 బంతుల్లో 13 ఫోర్లు) మెరవటంతో అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆటలో 85 ఓవర్లలో 3 వికెట్లకు భారత్ 368 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గనిస్తాన్ బౌలర్ మహ్మద్ సలీమ్ (2/67) రెండు వికెట్లతో రాణించాడు.
యశస్వి జైస్వాల్ విఫలం
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఓపెనర్లు ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (24) ఐదు ఫోర్లతో దూకుడుగా ఆడినా.. వికెట్ నిలుపుకోలేదు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (37), సాయి సుదర్శన్ (32) తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించారు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో కెఎల్ రాహుల్ వికెట్కీపర్ చేతికి చిక్కినా.. అఫ్గనిస్తాన్ రివ్యూ తీసుకోలేదు. దీంతో రాహుల్కు జీవనదానం లభించింది. తొలి సెషన్లో 25 ఓవర్లలో భారత్ ఓ వికెట్కు 96 పరుగులు చేసింది.
రాహుల్, సాయి సుదర్శన్ మెరుపుల్
లంచ్ విరామం తర్వాత కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్ బ్యాట్ ఝులిపించారు. ఐపీఎల్ ఫామ్ను సాయి సుదర్శన్ కొనసాగించగా.. రాహుల్ ఓ ఎండ్లో నిలబడ్డాడు. 8 ఫోర్లతో 67 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ సెంచరీ దిశగా సాగాడు. కానీ మమ్మద్ సలీమ్ ఓవర్లో వికెట్ల వెనకాల క్యాచౌట్గా నిష్క్రమించాడు. కెఎల్ రాహుల్ 7 ఫోర్లతో 86 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. రెండో సెషన్లో 25 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయిన భారత్ 113 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ అవుటవగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్ (20)తో కలిసి రాహుల్ అజేయంగా నిలిచాడు.
శతక మోత మోగింది
చివరి సెషన్లో పరుగుల మోత మోగింది. 35 ఓవర్లలో అఫ్గాన్ ఓ వికెట్ పడగొట్టగా.. భారత్ 159 పరుగులు పిండుకుంది. కెఎల్ రాహుల్ 11 ఫోర్లతో 164 బంతుల్లో కెరీర్ 12వ సెంచరీ సాధించాడు. సెంచరీ తర్వాత రాహుల్ వికెట్ కాపాడుకోలేదు. కెరీర్ 50వ టెస్టు ఆడుతున్న రిషబ్ పంత్ తోడుగా శుభ్మన్ గిల్ నాల్గో వికెట్కు అజేయంగా 121 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరూ 24.4 ఓవర్లలో 4.9 రన్రేట్తో పరుగులు సాధించారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్తో 68 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన గిల్.. 11 ఫోర్లు, ఓ సిక్సర్తో 138 బంతుల్లో సెంచరీ సాధించాడు. పేలవ ఐపీఎల్ సీజన్ నుంచి కోలుకున్న పంత్ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో తనదైన శైలిలో అర్థ సెంచరీ సాధించాడు. మూడు సెషన్లలో అఫ్గాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన టీమ్ ఇండియా తొలి రోజు తిరుగులేని స్థితిలో నిలిచింది.
స్కోరు వివరాలు :
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) అఫ్సార్ (బి) మహ్మద్ సలీమ్ 24, కెఎల్ రాహుల్ (సి) రెహమ్మనుల్లా గుర్జాజ్ (బి) జియార్ రెహమాన్ 100, సాయి సుదర్శన్ (సి) అష్ఫార్ జజాయ్ (బి) మహ్మద్ సలీమ్ 8, శుభ్మన్ గిల్ నాటౌట్ 103, రిషబ్ పంత్ నాటౌట్ 50, ఎక్స్ట్రాలు : 10, మొత్తం : (85 ఓవర్లలో 3 వికెట్లకు) 368.
వికెట్ల పతనం : 1-41, 2-180, 3-247.
బౌలింగ్ : జియార్ రెహమాన్ 15-2-61-1, అజ్మతుల్లా ఓమర్జాయ్ 14-3-42-0, మహ్మద్ సలీమ్ 13-1-67-2, నాంగేయాలియ ఖరొటె 20-0-95-0, అబ్దుల్ మాలిక్ 6-0-37-0, హస్మతుల్లా షాహిది 17-0-61-0.
భారత్ తొలి ఇన్నింగ్స్ 368/3



