గవర్నర్‌ తమిళిసై ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ట్విట్టర్ (ఎక్స్‌) అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. సైబర్ నేరగాళ్లు గవర్నర్ ట్విట్టర్‌ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.  ఇటీవలే దేశంలోని పలువురు ప్రముఖుల ఎక్స్‌ ఖాతాలు హ్యాక్‌కు గురవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోషల్‌ మీడియా అకౌంట్‌ హ్యాక్‌ అయ్యింది. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్‌ ఖాతా కూడా హ్యాక్‌కు గురైంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్‌ ఖాతా కూడా హ్యాక్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు గవర్నర్‌ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌ అవడం తీవ్ర కలకలం రేపుతోంది.

Spread the love