గవర్నర్‌ వాకౌట్‌

తమిళనాడు అసెంబ్లీ నుంచి అర్ధంతరంగా బయటకు..– తమిళనాడు అసెంబ్లీ నుంచి అర్ధంతరంగా బయటకు..
– కేంద్రాన్ని విమర్శించే ప్రసంగం చదవనంటూ వ్యాఖ్యలు

– రాష్ట్ర ప్రభుత్వంతో క్షీణించిన సంబంధాలు
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. సోమవారం అసెంబ్లీ సమావేశాల నుండి గవర్నర్‌ రవి అర్ధంతరంగా లేని వెళ్లిపోయారు. కేంద్రాన్ని విమర్శించేలా తమిళనాడు ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదివేందుకు ఆయన తిరస్కరించారు. మధ్యలోనే ప్రసంగాన్ని ఆపివేసి, జాతీయ గీతాన్ని ఆలపించేవరకు కూడా వేచి చూడకుండానే సభ నుండి వెళ్ళిపోయారు.
2024 సంవత్సరానికి అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవ ప్రసంగం చేయడం తన గౌరవంగా భావిస్తున్నానని తొలుత వ్యాఖ్యానిస్తూ కేవలం నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఆయన మాట్లాడారు. తనను చదవమని డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో కొన్ని పేరాలతో తాను ఏకీభవించలేనని, వాస్తవిక, నైతిక ప్రాతిపదికన వాటితో విభేదిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అటువంటి ప్రసంగాన్ని తాను చదివినిట్లైతే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లవుతుందన్నారు. అందువల్లే ఈ సభా గౌరవాన్ని దృష్టిలో వుంచుకుని తాను ప్రసంగాన్ని ముగిస్తున్నానని చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం, వారి మంచి కోసం ఈ సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆయన సెలవు తీసుకున్నారు.
సభా ప్రారంభానికి ముందుగా, తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించాలని తాను చేసిన అభ్యర్ధనను అసెంబ్లీ పదే పదే నిర్లక్ష్యం చేస్తోందని గవర్నర్‌ పేర్కొన్నారు. జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. తమిళ భాషను ప్రశంసిస్తున్న గీతాన్ని సభా ప్రారంభానికి ముందుగా ఆలపించడం, సమావేశాల ముగింపులో జాతీయ గీతాన్ని ఆలపించడం తమిళనాడులో సంప్రదాయంగా వస్తోంది.
గవర్నర్‌ వెళ్లిపోవడంతో ఆ తర్వాత ఆ ప్రసంగాన్ని స్పీకర్‌ ఎం.అప్పవు చదివి వినిపించారు. బీజేపీ ఎంఎల్‌ఎలతో సహా పాలక, ప్రతిపక్ష సభ్యులందరూ సమావేశం ముగిసేవరకు సభలోనే వున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, చర్యలను విమర్శిస్తూ ఆ ప్రసంగం సాగింది. జీఎస్టీ, చెన్నై మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోవడం వంటి అంశాలను ప్రస్తావించింది.
పైగా తమిళనాడు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు అనుమతించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనివల్ల భిన్నత్వంలో ఏకత్వం అన్న ఉద్దేశ్యానికే తీవ్రమైన ముప్పు ఏర్పడుతుందని వ్యాఖ్యానించింది. గతేడాది బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలో కూడా గవర్నర్‌ రవి కొన్ని పేరాలను వదిలేసి చదివారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు, ద్రవిడ తరహా పాలన, అంబేద్కర్‌, ద్రవిడ నేతలు గురించి వున్న భాగాలను ఆయన వదిలేశారు. ఈ వైఖరిని ఆనాడు స్టాలిన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
కేంద్రంపై విమర్శల హోరు !
48పేజీల ఈ ప్రసంగంలో, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తమిళనాడు సాధించిన విజయాలతో పాటూ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని కూడా సవివరంగా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తమిళనాడులో సంభవించిన తీవ్రమైన వరదల వల్ల కలిగిన నష్టాన్ని ఎదుర్కొనేందుకు మరిన్ని నిధులు అవసరంగా వుందని కూడా ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్ధిక స్వయంప్రతిపత్తిని కూడా వదులుకుని, జీఎస్టీని అమలు చేయడానికి అంగీకరించాయని, రాష్ట్రాలకు తగిన నష్టపరిహారం అందుతుందని, చట్టబద్ధంగా తమకు రావాల్సిన రెవిన్యూ వస్తుందని ఆశించాయని, కానీ అలా జరగలేదని, కేంద్రం 2022 జూన్‌లో నష్టపరిహార నిబంధనలను రద్దు చేసిందని, దాంతో రాష్ట్రం ఏటా రూ.20వేల కోట్ల రెవిన్యూ లోటును ఎదుర్కొంటోందని ఆ ప్రసంగం పేర్కొంది. ఇకపై నష్టపరిహారం ఇచ్చేలా నిబంధనలు తిరిగి కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఆ ప్రసంగం పేర్కొంది.
చెనైన మెట్రో రైలు ప్రాజెక్టుకు కూడా సమానంగా ఖర్చు భరిస్తామని తొలుత ఇచ్చిన హామీ నుంచి కేంద్రం వెనక్కి మళ్ళిందని, దాంతో రెండేండ్లకు పైగా ఈ ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని విమర్శించింది. ఇటువంటి ప్రాజెక్టులకు ఇతర రాష్ట్రాల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారని ఇక్కడ కూడా పూర్వం అనుకున్న రీతిలో పరిస్థితులను పునరుద్ధరించాలని కోరింది.
రాష్ట్రంలో మత సామరస్యతను పరిరక్షించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, దానికే కట్టుబడి వున్నామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఏఏను అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. 2021 నుంచి ఆలస్యమవుతూ వస్తున్న జాతీయ జన గణనతో పాటూ కుల గణన కూడా చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.

Spread the love