ప్రగతి భవన్ లో ఘనంగా దసరా వేడుకలు

 – కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి సీఎం ప్రత్యేక పూజలు
– శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ, ఆశీర్వచనంలో  పాల్గొన్న సీఎం కేసీఆర్
 – రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించిన సీఎం

నవతెలంగాణ హైదరాబాద్: విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోశ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్దతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు. శుభసూచకంగా భావించే పాలపిట్టను సీఎం దర్శనం చేసుకున్నారు.


సాంప్రదాయం ప్రకారం దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరకీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.

Spread the love