కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి
మనోహర్లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-2 అవసరం ఎంతో ఉందని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. మెట్రో ఫేజ్-2 సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖట్టర్కు తెలిపారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి మాణిక్రాజ్, పైనాన్స్ అండ్ ప్లానింగ్ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, స్పెషల్ సెక్రటరీ (కో-ఆర్డినేషన్) అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.



