టెహ్రాన్ : అమెరికా క్షిపణి దాడిలో దెబ్బతిన్న తాగునీటి రిజర్వాయర్, మందుగుండు సామగ్రి శకలాల ఫొటోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ మెహర్ బుధవారం విడుదల చేసింది. ఈ శకలాలు అమెరికాలో తయారైన బాంబుకు చెందినవిగా కన్పిస్తున్నాయని నిపుణులు తెలిపారు. దెబ్బతిన్న నీటి ట్యాంక్ ఫొటోలను ఓ స్వతంత్ర పరిశోధకుడు తొలుత సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్్లో పోస్ట్ చేశాడు. ఆ నీటి ట్యాంక్ దక్షిణ ఇరాన్ లోనిది. నీటి రిజర్వాయర్పై పడిన మందుగుండు సామగ్రి అవశేషాలు మెహర్ విడుదల చేసిన ఫొటోలలో కన్పిస్తున్నాయి. ఇవి జీబీయూ-39 సిరీస్కు చెందిన మందుగుండు సామగ్రికి చెందినవని, అవి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయని ఆయుధ నిపుణులు గుర్తించారు. ఇజ్రాయిల్, కొన్ని గల్ఫ్ దేశాల ఆయుధాగారాలలో కూడా ఈ మందుగుండు సామగ్రి ఉంది. జెనీవా కన్వెన్షన్ కింద నీటి సదుపాయాలకు రక్షణ ఉంటుంది. అయితే ఇరాన్ డీశాలినేషన్ (ఉప్పు నీటిని, ఇతర ఖనిజాలను తొలగించి తాగడానికి, వ్యవసాయానికి అనువైన మంచినీరుగా మార్చే ప్రక్రియ) ప్లాంట్లపై దాడులు చేసే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చెప్పారు. ట్రంప్ ప్రకటన అమెరికాకు చెందిన గల్ఫ్ మిత్రులలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. కాగా బామని జిల్లాలో రెండున్నర వేల క్యూబిక్ మీటర్ల సామర్ధ్యం ఉన్న రెండు కాంక్రీట్ నీటి నిల్వ రిజర్వాయర్లు క్షిపణుల దాడిలో దెబ్బతిన్నాయని, నిరుపయోగంగా మారాయని మెహర్ వార్తా సంస్థ అంతకుముందు తెలియజేసింది. ఐఆర్జీసీ అనుబంధ తస్నిమ్ వార్తా సంస్థ కూడా ఈ దాడులపై సమాచారాన్ని అందిస్తూ రెండు రిజర్వాయర్లు కనీసం ఇరవై వేల మంది అవసరాలు తీరుస్తున్నాయని చెప్పింది.
అమెరికా దాడిలో దెబ్బతిన్న నీటి రిజర్వాయర్ల చిత్రాలు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



