కిరీటాలు తగిలించుకొని ఊరేగుతున్న అహంభావాలకు గుండెలు గుభేలుమం టున్నాయి. జరిగిన పరిణామాలు మింగుడు పడటం లేదు. అసలు జీర్ణమవటం లేదు. జంతర్ మంతర్ ఉద్యమ ఘటన వాళ్లను నిద్రపోనీయటం లేదు. ఉద్యమానికి ఒక అడుగు వెనక్కి వేసామని కూడా అనుకోవడంతో లేదు. అసలు మంత్రి రాజీనామా చేస్తూ చెప్పిన మాటలు వింటే జెన్ జీ పోరాటాన్ని హేళన చేస్తున్నట్లుగానే ఉంది. ఇక మొత్తం బీజేపీ నాయకత్వం ఎదురుదాడితో, అబద్ధాలతో, అర్ధ సత్యాలతో విష ప్రచారానికి పూనుకొంటున్నది. పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగిన సూటియైన ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. పోలీసుల క్రూర దాడిలో క్షతగాత్రుల గురించి ఒక్కమాట లేదు. ‘ఫ్రెండ్స్’ అని సంబోధించిన మోడీ కక్షపూరితంగా విద్యార్థుల వేట, వారిపై కేసులు కొనసాగిస్తున్నాడు. అంతకుమించి విద్యార్థుల మీద అవమానకరమైన దాడికి పూను కుంటున్నారు. వారి మీడియా, అంధభక్తులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పటికీ నీచ ప్రచారానికి దిగుతూనే ఉన్నారు. బెదిరింపులకూ పాల్పడుతున్నారు. ఇదంతా దొంగే దొంగ దొంగ అన్న చందంగా ఉంది. వారి అజ్ఞానం అంధభక్తి శిఖరస్థాయికి చేరుతున్నది. చాలామంది ఈ ఉద్యమంతో కండ్లు తెరిచినా, మురికి కూపంలో మసలుతున్న వాళ్లు మాత్రం ఆగడం లేదు.
అందులోనూ సినీ పరిశ్రమలో హీరోయిన్గా పేరొందిన ప్రస్తుత లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలు దేశ యువతను, కుటుంబాలను, తల్లిదండ్రులను కించపరిచే విధంగా ఉన్నాయి. ఆమె ఎందుకు అంత రెచ్చిపోయి మాట్లాడుతుందో, ఏమి ఆశిస్తున్నదో తెలియదు. ఈ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా, జెన్ జీ చేసిన ఉద్యమాన్ని, వారి శాంతియుత మార్గాన్ని పొగుడుతుంటే, గొప్ప ఉద్యమని ప్రశం సిస్తుంటే, మన రనౌత్ ‘‘గట్టర్ జనరేషన్’’ అన్నారు. అంటే మురికి కాలువ వంటివారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, నా జీవితంలో ఇంత కంపును ఎప్పుడూ చూడలేదని, జెన్ జీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయని చెప్పారు. వాళ్లు మాట్లాడే భాష, విధానం నేనెప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు మరింత ముందుకు పోయి, ఇలాంటి వారిని ఎవరు కంటున్నారూ? ఎవరు పెంచుతున్నారు అంటూ తల్లిదండ్రులనూ అవమానించారు. ఈమె నోటికి హద్దుపద్దూ ఉండదు. 2020లోనూ రైతు ఉద్యమ కారులపై నోరు పారేసుకున్నారు. ఉద్యమంలో పాల్గొనే మహిళలనుద్దేశించి వంద రూపాయల కోసం ధర్నాలో కూర్చుం టారని అవమానించారు. అప్పుడు ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ ఎయిర్ పోర్టులో తీవ్ర ఆగ్రహంతో చెంప చెల్లుమనిపించారు.
ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను చాలా నీచంగా అభివర్ణించడంపై విద్యార్థిలోకం, తల్లిదండ్రులూ మండి పడుతున్నారు. సీజేపీ నాయకుడిని ఎందుకు పనికిరానివాడని, చదువు, ఉద్యోగం లేనివాడని తిట్టిపోశారు. అతను జర్నలిస్టు, కాక్రోచ్ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులంతా ఉన్నత చదువులు చదువుతున్నవాళ్లే. స్వాతంత్ర్యం తర్వాత ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని వాదించిన కంగనకు ఎంత చదువు వచ్చో అందరికీ తెలిసిందే. అందుకే ఆమెకు సమాధానం చెప్పడం కూడా వ్యర్థమని భావిస్తున్నారు. ఉద్యమంలో నేరస్తులున్నారని చెబుతున్న ప్రభుత్వం, పార్లమెంటులో నేరపూరిత కేసులున్న యాభై శాతం సభ్యులున్నారని, అందులో వందమంది బీజేపీ వారేనని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని వాళ్లు కోరుతున్నారు. ఇప్పుడు మోడీని తిట్టినందుకు కేసులు పెడుతూ నిర్బంధిస్తున్నారు. విపరీతమైన అశ్లీల భాషను వాడుతున్నవాళ్లు సోషల్ మీడియాలో సంఘపరివారమే. ఇక కంగనా రనౌత్ వేష భాషలు, ఫొటోషూట్లు, విచ్చలవిడి ప్రవర్తనలు ఎవరికీ తెలియనివి కావు. అలాంటి వ్యక్తులే అశ్లీలత గురించి మాట్లాడటం మరీ విడ్డూరంగా ఉంది. పైగా జెన్ జీ నాయకులను విమర్శించినవాళ్లు, హేళన చేసినవాళ్లు, బీజేపీలోకి రమ్మని కోరటం చూస్తే వాళ్లెంత దిగజారి ఉన్నారో అర్థమవుతోంది.
ఇక కేరళకు చెందిన టి.జి.మోహన్ దాస్, సంఘ్ సభ్యుడు మరింత దారుణంగా మాట్లాడాడు. ‘నా కంట్రోల్లో ఉంటే జంతర్ మంతర్లో జెన్ జి ఉద్యమకారులను కాల్చేసేవాన్ని, కొందరు చచ్చేవాళ్లు, ఇంకొందరి కాళ్లూ చేతులు విరిగేవి’ అన్నాడు. మరీ దుర్మార్గంగా అమ్మాయిలపై వ్యాఖ్యలు చేశాడు. ఇతనిపై ఏ కేసూ నమోదు చేయడం లేదు మరి! మహిళలు ఇంటికే పరిమితం కావాలన్న ఆలోచనలున్నవారికి, ఇంతకంటే మంచి మాటలేమి వస్తాయి. ప్రాణాలకు తెగించి పోరాడిన విద్యార్థులను అవమానించడం, తల్లిదండ్రులనూ నిందించడం కేవలం గట్టర్ మౌత్లే చేయగలవు!
గట్టర్ మౌత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



