హార్దిక్‌ అదరహో

హార్దిక్‌ అదరహో– వైస్‌ కెప్టెన్‌ అజేయ అర్థ సెంచరీ
– రాణించిన పంత్‌, దూబె, కోహ్లి
– బంగ్లాదేశ్‌పై భారత్‌ 196/5
– ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2024
భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. ఆంటిగ్వాలో పంత్‌, దూబె, కోహ్లి సైతం మెరువగా హార్దిక్‌ పాండ్య అదిరే ముగింపు అందించాడు. భారత బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనతో వివ్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో టీమ్‌ ఇండియా అత్యధిక స్కోరు 196/5 సాధించింది.
నవతెలంగాణ-నార్త్‌సౌండ్‌
హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌, 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. విరాట్‌ కోహ్లి (37, 28 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), రిషబ్‌ పంత్‌ (36, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా శివం దూబె (34, 24 బంతుల్లో 3 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌8 గ్రూప్‌-1లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ గ్రౌండ్‌లో జరిగిన టీ20ల్లో ఇదే అత్యధిక స్కోరు కావటం విశేషం. బంగ్లాదేశ్‌ బౌలర్లలో హసన్‌ షకిబ్‌ (2/32), రిషద్‌ (2/43) రెండేసి వికెట్లు పడగొట్టారు.
కలిసికట్టుగా కొట్టారు : టాస్‌ నెగ్గిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (23, 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ దూకుడు ప్రదర్శించాడు. కోహ్లి (37) నెమ్మదిగా ఆడినా రోహిత్‌ దూకుడుతో తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. షకిబ్‌ ఓవర్లో భారీ షాట్‌కు వెళ్లిన రోహిత్‌ నిష్క్రమించినా.. రిషబ్‌ పంత్‌ (36) తోడుగా కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడీ 27 బంతుల్లో 32 పరుగులు నమోదు చేసింది. అప్పటికే మూడు సిక్సర్లు బాదిన ఉత్సాహంలో హసన్‌ షకిబ్‌ ఓవర్లో క్రీజు వదిలొచ్చిన కోహ్లి వికెట్లను కోల్పోయాడు. అదే ఓవర్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (6) సైతం అవుటయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌లో వేగం కాస్త మందగించింది. అయినా, పంత్‌ సహజశైలిలో రెచ్చిపోయాడు. విలక్షణ షాట్లతో పరుగులు పిండుకున్నాడు. రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో అలరించినా.. రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి వికెట్‌ పారేసుకున్నాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న శివం దూబె (34) స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. మూడు సిక్సర్లతో చెలరేగాడు. ఇక ఇన్నింగ్స్‌కు వైస్‌ కెప్టెన్‌కు హార్దిక్‌ పాండ్య (50 నాటౌట్‌) అదిరే ముగింపు అందించాడు. 180 పరుగులు చేసేలా కనిపించిన భారత్‌కు 196 పరుగుల భారీ స్కోరు అందించాడు. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ వేసిన చివరి ఓవర్లో బౌండరీల మోత మోగించిన పాండ్య 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అక్షర్‌ పటేల్‌ (3 నాటౌట్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) అలీ (బి) షకిబ్‌ అల్‌ హసన్‌ 23, విరాట్‌ కోహ్లి (బి) హసన్‌ షకిబ్‌ 37, రిషబ్‌ పంత (సి) హసన్‌ షకిబ్‌ (బి) రిషద్‌ 36, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) లిటన్‌ దాస్‌ (బి) హసన్‌ షకిబ్‌ 6, శివం దూబె (బి) రిషద్‌ 34, హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 50, అక్షర్‌ పటేల్‌ నాటౌట్‌ 3, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్ల) 196.
వికెట్ల పతనం : 1-39, 2-71, 3-77, 4-108, 5-161.
బౌలింగ్‌ : మెహిది హసన్‌ 4-0-28-0, షకిబ్‌ అల్‌ హసన్‌ 3-0-37-1, హసన్‌ షకిబ్‌ 4-0-32-2, ముస్తాఫిజుర్‌ 4-0-48-0, రిషద్‌ 3-0-43-2, మహ్మదుల్లా 2-0-8-0.

Spread the love