సన్న వడ్లకే రూ.500 ఇస్తామనడం రైతులను దగా చేయడమే: హరీష్ రావు

నవతెలంగాణ – హైదరాబాద్: సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ క్యాబినెట్ ఈరోజు నిర్ణయించింది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని… కానీ వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని.. అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని..10 శాతం పండే సన్న వడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. సన్న వడ్లకు మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్‌లో ధర వస్తుందన్నారు. కానీ, దొడ్డు రకం బియ్యానికే గిట్టుబాటు ధర రాదని పేర్కొన్నారు. అందుకే బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే అన్నారు. కానీ సన్నరకం వడ్లకు… అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామని చెప్పడం రైతులను దగా చేయడమే అన్నారు. కేబినెట్ తర్వాత మంత్రులు చేసిన ప్రకటనతో… కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమంపై, వ్యవసాయాభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు.

Spread the love