నవతెలంగాణ-హైదరాబాద్ : మేడారం మహాజాతరకు హాజరైన భక్తజనం మొక్కులు అప్పగించిన అనంతరం తిరుగు పయనమవుతున్నారు. దీంతో తాడ్వాయి మండలం రెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన మేడారం బస్ స్టేషన్లో భక్తులతో కిక్కిరిసిపోతోంది. తాడ్వాయి నుంచి మేడారం రూట్లో ప్రయివేటు వాహనాలకు అనుమతించడం లేదు. అయితే శుక్రవారం పెద్ద ఎత్తున ప్రయివేటు వాహనాలు రోడ్డుపైకి రావడం, ఆర్టీసీ బస్సుల రద్దీ తీవ్రంగా ఉండటంతో ట్రాఫిక్ జాం అయింది. దీంతో వేలాది వాహనాలు ట్రాఫిక్లో ఇరుకుపోయాయి. భక్తులు గంటల తరబడి వాహనాల్లోనే ఉండాల్సి వచ్చింది. స్వయంగా ములుగు ఎస్పీ శబరీష్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే రాత్రి ఏడున్నర గంటల తర్వాత కూడా ట్రాఫిక్ జాంను క్లియర్ చేయలేకపోయారు.