భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : తాగుడు విషయంలో భార్యతో జరిగిన గొడవతో మనస్థాపానికి గురయిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని ఎన్‌బీటీనగర్‌లో నివాసం ఉంటున్న డేరంగుల చిరంజీవి(35)కి భార్య వసంతతో పాటు ఇద్దరు పిల్లలున్నారు. గత కొంతకాలంగా చిరంజీవికి, భార్య వసంతకు మద్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. రోజూ తాగివస్తున్న భర్తను మందలిస్తుండడంతో గొడవలు పెద్దవయ్యాయి. ఈ క్రమంలో నాలుగురోజుల క్రితం పిల్లలను బాబాయి రంగస్వామి సొంతూరైన అనంతపురం తీసుకువెళ్లాడు. కాగా రాత్రి 8గంటలకు మరోసారి మద్యం సేవించి ఇంటికి వచ్చిన చిరంజీవితో భార్య వసంత గొడవకు దిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో వసంత ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. రెండు గంటల తర్వాత ఇంటికి వచ్చి చూడగా భర్త చిరంజీవి చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని అపోలో దవాఖానలో చేర్చగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Spread the love