ఆడిటోరియంలో ప్రసంగిస్తూ కుప్పకూలిన ఐఐటీ ప్రొఫెసర్ మృతి..!

నవతెలంగాణ- హైదరాబాద్: ఐఐటీ కాన్సూర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొ. సమీర్ ఖండేకర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ప్రసంగం మధ్యలో ఆయన ఛాతిలో నొప్పి రావడంతో కూలబడిపోయారు. నిమిషాల వ్యవధిలో అచేతనంగా మారిన ఆయన్ను సమీపంలోని కార్డియాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు తేలింది. అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి అకస్మాత్తుగా మరణించడంతో విద్యార్థులు, సహ ప్రొఫెసర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. 2019 నుంచి ప్రొ. ఖండేకర్ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కాగా, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఉన్న ఆయన కుమారుడు తిరిగొచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జబల్పూర్‌లో జన్మించిన ప్రొ. సమీర్ ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ చేశారు. అనంతరం, జర్మనీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. 2020లో ఆయన ఐఐటీ కాన్పూర్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నియమితులయ్యారు.

Spread the love