అక్రమ మైనింగ్ ను సహించేది లేదు.. మంత్రి జూపల్లి సీరియస్

– సమగ్ర నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం 
నవతెలంగాణ – కంటేశ్వర్
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు నష్టం కలిగించే రీతిలో కొనసాగుతున్న అక్రమంగా మైనింగ్ ను ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ప్రజాపాలన కార్యక్రమం అమలు తీరుపై మంగళవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా మంత్రి అక్రమ మైనింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ సీరియస్ అయ్యారు. సమీక్ష కోసం తాను నిజామాబాద్ కు వస్తున్న సందర్భంగా కామారెడ్డిలో పలువురు బాధితులు తనను కలిసి మాచారెడ్డి ఉమ్మడి మండలంలోని మంథని, దేవునిపల్లిలలో  కొనసాగుతున్న అక్రమ మైనింగ్ గురించి ఫిర్యాదు చేశారని అన్నారు. భారీ పేలుళ్ల కారణంగా వందలాది బోరు బావులు, నివాస గృహాలు దెబ్బతిన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. గత కొన్నాళ్లుగా అక్రమ మైనింగ్, బ్లాస్టింగ్స్ జరుగుతున్న ఎందుకు చర్యలు చేపట్టలేదని సంబంధిత మైనింగ్, రెవెన్యూ అధికారులను ఆరా తీశారు. తక్షణమే విచారణ జరిపి వారం రోజుల్లో తనకు సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ మైనింగ్ కారణంగా నష్టపోయిన బాధితులకు మైనింగ్ యాజమాన్యం ద్వారా నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలో సైతం పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కొనసాగుతోందని స్థానిక శాసనసభ్యుడు మంత్రి దృష్టికి తేగా, దానిపైనా విచారణ జరిపించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
Spread the love