- అదనపు కలెక్టర్ బి.ఎస్ లత
– అధికారులకు స్పష్టమైన ఆదేశాలు -జనగణన, భూసమస్యలపై ఫోకస్ - నవతెలంగాణ–రాయికల్
- పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)బి.ఎస్ లత తహసిల్దార్ నాగార్జునతో పెండింగ్ అంశాలు, ఓటరు జాబితా సవరణ, సాదా బైనామా అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే మీసేవ ద్వారా అందే సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసి ప్రజలకు సకాలంలో అందజేయాలని ఆదేశించారు.
జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులను అధికారులు,సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమిస్తామని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఇండ్ల గణన ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, నివేదికలను సమయానికి సమర్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ నాగార్జున మాట్లాడుతూ.. గత 10 నెలలుగా డిప్యూటీ తహసిల్దార్ నియామకం లేకపోవడంతో ప్రోటోకాల్ పాటించడంలో, విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కనీసం డిప్యూటేషన్పై అయినా డిప్యూటీ తహసిల్దార్ను నియమించాలని అదనపు కలెక్టర్కు విన్నవించారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.



