– రోస్టర్ పాయింట్లు రద్దు సరికాదు..
– తక్షణమే జీవో 3ను వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కలను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని పేర్కొన్నారు. ఆడబిడ్డలకే కాకుండా వికలాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు సోమవారం నాడు కవిత లేఖ రాశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయనీ, వారికి హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టికల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందని పేర్కొన్నారు. దాంతో జీవో 41, 56లను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. 100 ఉద్యోగాల ఉంటే 33 ఉద్యోగాలు కచ్చితంగా మహిళలకు వస్తాయనీ, అదనంగా మరన్ని ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉండేదని వివరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హారిజాంటర్ రిజర్వేషన్లు అమలు చేస్తూనే రోస్టర్ పాయింట్లు ఎత్తివేయడానికి జీవో 3ని తీసుకొచ్చిందని తెలిపారు. రోస్టర్ పాయింట్లు రద్దు చేయడం వల్ల 100 ఉద్యోగాల్లో మహిళలకు 33 ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనకు భంగం కలుగుతుందని, 33 కంటే తక్కువ ఉద్యోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 16 ఉద్యోగాలు ఉంటేనే ఒక ఎస్సీ మహిళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని ఉదాహరించారు. మహిళలకు రావాల్సిన ఉద్యోగాలు పురుషులకు దక్కుతాయని తెలిపారు. ఇది రిజర్వేషన్ల స్పూర్తికి భంగం కలిగిస్తుందనీ ఆ రకంగా ప్రభుత్వం నిర్ణయించటం సరికాదని విమర్శించారు.