నేడు ఐసెట్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్‌ రాతపరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసెట్‌ కన్వీనర్‌ పి వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)లోని కాలేజీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ సెమినార్‌ హాల్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేయూ వీసీ తాటికొండ రమేష్‌, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు పాల్గొంటారని పేర్కొన్నారు. గతనెల 26,27 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌ రాతపరీక్షలకు 37,112 మంది అబ్బాయిలు, 38,815 మంది అమ్మాయిలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు కలిపి మొత్తం 75,932 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 70,900 మంది హాజరయ్యారు.

Spread the love