నవతెలంగాణ – తిరువనంతపురం: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ‘విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం’ (వీఎస్ఎస్సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్షను రద్దు చేశారు. వేరొకరికి బదులుగా పరీక్షలు రాస్తూ మోసగించారనే ఆరోపణలపై హరియాణాకు చెందిన ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దీనిపై కేరళ పోలీసులు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించగా, ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు వీఎస్ఎస్సీ ప్రకటించింది. టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్మేన్-బి, రేడియోగ్రాఫర్-ఏ పోస్టుల కోసం మళ్లీ ఎప్పుడు పరీక్షలు జరిగేదీ వెబ్సైట్ ద్వారా తెలియపరుస్తామని తెలిపింది. జాతీయస్థాయి పరీక్షను ఒక్క కేరళలోనే 10 కేంద్రాల్లో నిర్వహించారు. వేరేవారికి బదులుగా పరీక్షలు రాస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికిన ఇద్దరితోపాటు హరియాణాకు చెందిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దరిమిలా పరీక్షను రద్దు చేయాలని వీఎస్ఎస్సీని పోలీసులు కోరారు. హరియాణా నుంచే 400 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో కోచింగ్ కేంద్రాల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నిగ్గు తేల్చడానికి కేరళ నుంచి పోలీసుల బృందం హరియాణాకు వెళ్లనుంది. పరీక్షలో ఏదో అక్రమాలు జరుగుతాయంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్కాల్స్ ఆధారంగా ఇన్విజిలేటర్లను అప్రమత్తం చేసినప్పుడు బండారం బట్టబయలైందని పోలీసులు తెలిపారు. బటన్ కెమెరాలతో ప్రశ్నలను స్కాన్ చేసి ఎక్కడికో పంపించి, చెవిలో అమర్చుకున్న పరికరంతో సమాధానాలు విని పరీక్షలు రాశారని, ఆ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తామని వివరించారు.