2029లో సాధారణ ఎన్నికలు
ఫామ్ హౌస్ లో పాపాల భైరవుడు బందీ
అసెంబ్లీ స్థానాలు 182, పార్లమెంట్ స్థానాలు 26కు పెంపు
117 అసెంబ్లీ, 20 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాం
బ్యాండుమేళం బ్యాచ్లా బీఆర్ఎస్ సర్వేలు
మేడిగడ్డ కుంగితే ఖమ్మంలో 44 గ్రామాలు మునిగాయి
రాజకీయాల కోసం కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలంటున్నారు
ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ చింతకాని/బోనకల్
‘‘వచ్చే అసెంబ్లీ, లోక్సభ సాధారణ ఎన్నికలు 2028 డిసెంబరులో జరగవు. 2029 మే లేదా జూన్ మాసంలో జరుగుతాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు 26 కు పెరుగుతాయి. 119 అసెంబ్లీ స్థానాలు 182 కు పెరుగుతాయి. 36 నెలల ముందుగానే వచ్చే ఎన్నికల ఫలితాల జోస్యం చెబుతున్నా…182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుంది’’ అని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. భద్రాచలం రాములవారి మీద ఆన…ఈ మాట కోసం కాంగ్రెస్ కార్యకర్తలు రోజుకు 18 గంటలు పని చేస్తారు అని చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురంలో జరిగిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంక టరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, రామసాయం రఘు రాంరెడ్డి, బలరాంనాయక్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మెన్లు ఈ సభలో పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి సీఎం రేవంత్రెడ్డి 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1009.15 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు.
అలాగే రైతులకు ఇ-పట్టాదార్ పాస్ పుస్తకాలను అంద చేశారు. ఈ సందర్భం గా సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2023 లో ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతి ఎన్నికల్లో ప్రజా ప్రభు త్వాన్ని గెలిపించి, పాపాల భైరవుడిని ఫామ్ హౌస్ లోనే బందీ చేశారని చెప్పారు. జరగబోయే కురుక్షే త్రంలో కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీ య ముఖచిత్రం నుంచి పాతా ళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని అన్నారు. రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే, ఖమ్మం జిల్లా గుండె లాంటిదన్నారు. బీఆర్ఎస్ అధినేత కే చంద్ర శేఖర్ రావు (కేసీఆర్) దొంగ సర్వేలు చేయించుకొని, ఆత్మతృప్తి పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలు ఒక్క విషయం గుర్తు పెట్టుకోలంటూ ఎన్నికలు 2029లో జరుగుతాయని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేదనీ, ఒకే ఇంట్లో రెండు గుంపులు ఉన్నాయని ఎద్దేవా చేశా రు. ‘‘ఒకాయన కన్నె పల్లికి పోయి పంపులు ఆన్ చేయాలంటాడు. ఒకసారి మేడిగడ్డ కుంగితేనే ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోయాయి. మళ్లీ నీళ్లు నింపితే భద్రాచలం రాముడు మునుగుతాడు’’ అని హెచ్చ రించారు. మీ దుష్ట రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి చేసుకున్న సర్వేలో కాంగ్రెస్ ఓడిపో తుందనే దుష్ప్రచారానికి దిగారనీ, ఎన్నికలు ఎప్పుడో, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండా ఎవరైనా సర్వేలు చేస్తారా.. గెలుపు ఓటములు నిర్ణయిస్తారా? అని అడిగారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇలాగే చెబితే జనం బీఆర్ఎస్ను బండకేసి కొట్టార న్నారు. బ్యాడుమేళం బ్యాచ్ లా బీఆరెస్ సర్వేల బ్యాచ్ తయారైందని ఎద్దేవా చేశారు. బీజేపీ లోకి వెళ్ళనని హరీశ్ రావు కేసీఆర్ పై ఒట్టేసి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారనీ, ఆంధ్రా కాంట్రాక్టర్లు బీఆర్ఎస్కు వందల కోట్లు ఇచ్చారని కేసీఆర్ సొంత కూతురు, కేటీఆర్ సొంత చెల్లెలే చెబు తున్నదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అమలు చేసిన షాది ముబారక్, రైతు బందు పథకాలను తాము కొనసాగి స్తున్నామని చెప్పారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూ నిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని గుర్తుచేశారు. రైతు భరోసాను రూ. 12 వేలకు పెంచి, రైతు రుణమాఫీ అమలు చేశామని వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 26 పార్లమెంట్ స్థానాలకు 20 పార్లమెంట్ స్థానాలు గెలిపించి, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని పిలుపునిచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరినట్టు మధిరకు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తామన్నారు. ఈ బహిరంగ సభకు భారీగా జనం హాజరయ్యారు.



