15 లోక్ సభ స్థానాల్లో గెలవబోతున్నాం: జగ్గారెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 లోక్ సభ స్థానాల్లో గెలవబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తర్వాత తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. పదేళ్ల పాటు తెలంగాణలో దొరల పాలన చూశామని… ఇప్పుడు ప్రజాపాలన చూస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేశామని… మిగతా రెండు గ్యారెంటీలను కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. శనివారం నీలం మధుకు మద్దతుగా మెదక్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మనమంతా కలిసి నీలం మధును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. ఏది ఏమైనా పాతికేళ్ల తర్వాత ఇక్కడ మనం గెలవాల్సిందే అన్నారు. మేమంతా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మన ప్రభుత్వమే ఉందని… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చూసుకుంటారన్నారు. పోలీసులకు భయపడాల్సి అవసరం లేదన్నారు.

Spread the love