నవతెలంగాణ -హైదరాబాద్: టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ ప్రకటించిన జట్టుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎంపిక వెనుక ఒత్తిడి కీలక పాత్ర పోషించిందనే వ్యాఖ్యలు వినిపించాయి. ఈ క్రమంలో బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా స్పందించారు. ‘‘సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టు సమతూకంగా ఉంది. సెలక్టర్లు కేవలం ఐపీఎల్ ఫామ్పైనే దృష్టి పెట్టలేదు. విదేశాల్లో సదరు ఆటగాడికి ఉన్న అనుభవంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నా. కఠిన పిచ్లు ఉండే విండీస్ – యూఎస్ఏలో పొట్టి కప్ జరగనుంది. అనుభవంతోపాటు యువ క్రికెటర్లను ఎంపిక చేశాం. ఇందులో బీసీసీఐ కార్యదర్శిగా నా పాత్ర కేవలం సమాచారం ఇవ్వడం వరకే ఉంటుంది. కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీ నిర్ణయం మేరకే జట్టును ఎంపిక చేస్తాం’’ అని జైషా స్పష్టం చేశారు.