– 1.90 లక్షల మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ రాతపరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. వారిలో 1.90 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసినట్టు సమాచారం. వారిలో 1.46 లక్షల మంది అబ్బాయిలు ఉండగా, 44 వేల మంది అమ్మాయిలున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక సమాధానాల కీని ఈనెల 11న, ఫలితాలను అదేనెల 18న విడుదల చేస్తారు. తెలంగాణలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్తో మొత్తం 13 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో 22 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి. అడ్మిట్ కార్డులను www.jeeadv.ac.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.