– కో-ఆర్డినేటర్గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి
రంగారెడ్డి జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడి నియామకంపై కీలక సమావేశం ప్రక్రియలో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష నియామక కో-ఆర్డినేటర్గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్సీ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సీవీ మోహన్ అబ్జర్వర్గా పాల్గొన్నారు. టీపీసీసీ అబ్జర్వర్లుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్ రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కాంటెస్టెడ్ అభ్యర్థులు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులతో పాటు జిల్లా, మండల, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన డీసీసీ అధ్యక్షుడి నియామకంపై నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను కో-ఆర్డినేటర్లు, అబ్జర్వర్లు క్షుణ్ణంగా సేకరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, శ్రేణుల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రజల్లో పార్టీని శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడమే లక్ష్యమని సమావేశంలో పాల్గొన్న నాయకులు స్పష్టం చేశారు. సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి పార్టీ అధిష్ఠానానికి సమగ్ర నివేదిక అందించనున్నట్లు వారు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా, ప్రజా సేవే బాధ్యతగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.



