కొత్తగూడెం సీపీఐ అభ్యర్థిగా కూనంనేని

Kothanam is the candidate of CPI– బీఫారం అందించిన నారాయణ, అజీజ్‌పాషా, చాడ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం సీపీఐ అభ్యర్థిగా కూనంనేని సాంబశివరావు పేరును ఆ పార్టీ రాష్ట్ర సమితి ఖరారు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సీపీఐ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్తగూడెం అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శులు కె నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి బి ఫారాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభలో పేదలు, కార్మికులు, కర్షకులు, సామాన్యుల గొంతును వినిపించేందుకు సీపీఐని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాంబశివరావు బుధవారం కొత్తగూడెంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విశాలాంధ్ర దినపత్రిక విలేఖరిగా కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో హోల్‌ టైమర్‌గా పనిచేస్తున్నారు. 1987లో కొత్తగూడెం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షునిగా విజయం సాధించారు. 2009లో కూనంనేని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో సీపీఐ తరఫున కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నికయ్యారు. ఆయన సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు.

Spread the love