– రాజకుటుంబం చట్టపరమైన ఆస్తులపై సమావేశం
– రాజవంశ కుటుంబాలకు ఆస్తులపై అవగాహన
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిజాం అసఫ్ జాహీ రాజవంశం ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని, చట్టపరంగా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజవంశ కుటుంబీకులకు తెలియపరుస్తూ వారికి అవగాహన కల్పించారు. బేగంపేటలోని అసఫ్ జాహీ రాజవంశస్తుల 9వ నిజాం నవాబ్ రౌనక్ యార్ఖాన్ ఫంక్షన్ విల్లాలో అసఫ్ జాహీ రాజవంశం సమావేశం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశ్యం రాజకుటుంబానికి అవగాహన కల్పించడం, వారి చట్టపరమైన హక్కులు, ప్రస్తుత భారతీయ ముస్లిం చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు, కొన్ని విదేశాల్లో వేలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వారి విస్తారమైన ఆస్తిని రక్షించడంలో, తిరిగి పొందడంలో మార్గదర్శకత్వం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరంజిత్ సేన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ దినేష్రెడ్డి సహా గౌరవ అతిథులు ఈ సమావేశంలో ప్రసంగించారు. నవాబ్ రౌనక్ యార్ఖాన్ స్థాపించిన సొసైటీకి చెందిన ఈ విశిష్ట అతిథులు, అసఫ్ జాహీ రాజవంశం 9వ నిజాంగా నవాబ్ రౌనక్ నియామకాన్ని సమర్థిస్తూ, వారి చట్టపరమైన హక్కుల పరిరక్షణ కోసం వాదిస్తూ రాజకుటుంబాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ”హైదరాబాద్ నిజాం”తో అనుబంధించబడిన అధికారిక బిరుదులను తొలగించిన ప్రభుత్వ ధ్రువీకరణతో సంబంధం లేకుండా కుటుంబ పెద్ద ఎంపిక స్వతంత్రంగా ఉండాలని చెప్పారు. సమావేశ సమయంలో కీలకమైన వాస్తవాల గురించి హాజరైన వారికి అవగాహన కల్పించడంపై కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో తెలంగాణ మాజీ హౌమ్ కార్యదర్శి, ప్రస్తుత రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్ అజరు మిశ్రా, మాజీ జనరల్ రాజేష్ కుంద్రా, అంతర్జాతీయంగా బోధకుడు, జనాబ్ సాదత్ పీర్, ప్రఖ్యాత ముస్లిం సంఘం నాయకుడు జనాబ్ ఇఫ్తేకర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.