భావితరాల అభివృద్ధికి సీపీఐ(ఎం)కు ఓటేద్దాం

భావితరాల అభివృద్ధికి సీపీఐ(ఎం)కు ఓటేద్దాం– 100 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ
నవతెలంగాణ-గార్ల
నిరంతరం కార్మికులు, కర్షకుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహించే ఎర్రజెండా పార్టీకి ఓటు వేసి భావితరానికి అభివద్ధి బాటలు వేద్దామని సీఐటీయూ రాష్ట్ర నాయకులు వంగూరి రాములు, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గి కృష్ణ అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపును కోరుతూ ఆపార్టీ ఆధ్వర్యంలో 100 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబ్బు సంచులతో సంతలో పశువుల్లా ఓటర్లను కొనుగోలు చేసి గెలిచాక అభివృద్ధి పేరుతో సొంత లాభం కోసం పార్టీలు మారుస్తున్న వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని తెలిపారు. దళితుడిని సీఎం చేస్తానని, మూడు ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామని దళితులకు సీఎం కేసీఆర్‌ దగాచేశారన్నారు. కార్పొరేట్‌లకు దేశ సంపదను దోచిపెడతున్న బీజేపీని, సుదీర్ఘ కాలం పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించి ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు. కాగా, గార్ల నుంచి ప్రారంభమైన ర్యాలీ 20 గ్రామాల మీదుగా సాగింది. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్‌, సీపీఐ(ఎం) నాయకులు కందునూరి శ్రీనివాస్‌, కందునూరి కవిత, భూక్య హరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love