జనగణనకు, ఎన్నికలకు సంబంధం లేదు
ఎప్పుడైనా మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు
కసరత్తు ప్రారంభించిన అధికారులు
ప్రజాక్షేత్రంలోకి రాజకీయ పార్టీలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జనగణన జరుగుతున్న సమయంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా? జనాభా లెక్కలు పూర్తయ్యేవరకు ఎన్నికలను ఆపాల్సిందేనా? అన్న చర్చకు తెరపడింది. మున్సిపల్ ఎన్నికలకు, జనగణనకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తేల్చేశారు. దీనితో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను విభజించడంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాయి. దీంతో పాటు ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు, మునగనూరు, మందమర్రి, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. జనాభా లెక్కల ప్రక్రియతో హైదరాబాద్లోని మూడు కొత్త కార్పొరేషన్ల ప్రక్రియతో ఎన్నికలు ఆగిపోతాయనే చర్చ జరిగింది. అయితే జనాభా లెక్కలకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తేల్చారు. వీటి గడువు ముగిసి దాదాపు నాలుగు నెలలైంది. పాలకవర్గాలు లేకపోవడంతో మున్సిపాల్టీలు ప్రస్తుతం ప్రత్యేక పాలనాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి. అంతేకాకుండా మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాల్సివుంది.
దీని ద్వారానే మున్సిపాల్టీల అభివృద్ధి కోసం కేంద్రంతో సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. ఆయా మున్సిపాల్టీల పనితీరు ఆధారంగా కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి. ఆర్థిక నిర్వహణ విషయంలో కేంద్రం నిబంధనలను అమలు చేయడం తప్పనిసరి. అప్పుడే మున్సిపాల్టీలకు గ్రాంట్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కేంద్రం జనాభా లెక్కల నోటిఫికేషన్ కంటే ముందుగానే రాష్ట్రప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ను విభజించడం, సరిహద్దులు గుర్తించడం, ప్రత్యేక అధికారులను నియమించడం, సిబ్బందిని నియమించడం లాంటి చర్యలు తీసుకుంది. దీనితో మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు. జనాభా లెక్కలు మే, 2027 వరకు కొనసాగనున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజించడం, ఎన్నికలకు నిర్వహించడం సరైందికాదంటూ హైకోర్టులో ఫిటిషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం మున్సిపల్ శాఖ అధికారులకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను సన్నద్దం చేస్తున్నది. ప్రజలకు కొన్ని వాగ్ధానాలు కూడా చేస్తున్నది. ఆ తర్వాత హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో బలంగా ఉన్న ఎంఐఎం నాయకులు బస్తీల్లో తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు.
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా తన ఎంపీ ల్యాండ్స్ నిధులు ఇచ్చిన చోట పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ గత ఎన్నికల్లో ఇద్దరు కార్పొరేటర్లకు పరిమితమైన అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో నాయకులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఎలాగైనా గ్రేటర్ హైదరాబాద్ను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నది. ఈ ఎన్నికల కోసం గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో నాయకులు కొట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా హస్తం పార్టీలో చేరారు. పలు అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టింది. బీజేపీ పార్టీ కూడా తమ బలాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కానీ అంతర్గత కుమ్ములాటలు, నాయకుల్లో నెలకొన్న విభేదాలతో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతున్నది. ఇటీవల జరిగిన మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో ప్రచారం కోసం పంపిణీ చేసిన నిధులను వ్యయం చేయకుండా చేతివాటం ప్రదర్శించారని ఆరోపణలు వినిపించాయి. దీనితో ఇప్పటికీ హైదరాబాద్లో బీజేపీ నాయకత్వం దృష్టి సారించలేకపోతున్నది.



