– బీసీ రిజర్వేషన్ల అమలుకు
– మిలియన్ మార్చ్ తరహా ఉద్యమం : బూర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు తేల్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బీసీ వెల్ఫేర్ కోసం ఏటా రూ.20 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి 400 సీట్లొస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడాన్ని ఖండించారు. మతపర రిజర్వేషన్లతో 70 నుంచి 75 శాతం మేర బీసీలకు మమతా బెనర్జీ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో చట్ట విరుద్ధంగా ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హౌదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పునివ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని విమర్శించారు.