రూ.11.4 కోట్ల క్రిస్టల్ మెత్ స్వాధీనం
ఇద్దరు మహిళల అరెస్ట్
నవతెలంగాణ-బేగంపేట్
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అధికారులు చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ స్థాయిలో క్రిస్టల్ మెత్ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో రూ.11.4 కోట్ల విలువైన 11.4 కిలోల యాంఫెటమైన్ (క్రిస్టల్ మెత్)ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. ఖచ్చితమైన సమాచారంతో చేపట్టిన ఈ దాడిలో.. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు అనుమానాస్పద మహిళలను గుర్తించి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగులను పరిశీలించగా, తెల్లటి స్ఫటిక పదార్థంతో నిండిన 10 పారదర్శక ప్యాకెట్లు బయటపడ్డాయి. తనిఖీల్లో చిక్కకుండా ఉండేందుకు నిందితులు మాదకద్రవ్యాలను నల్లటి పాలిథిన్ కవర్లలో చుట్టి, పైన డిజైనర్ పేపర్తో కప్పి, బెడ్షీట్ల మడతల మధ్య దాచినట్టు అధికారులు తెలిపారు. ఫీల్డ్ డ్రగ్ డిటెక్షన్ కిట్తో పరీక్షించగా, అది ‘క్రిస్టల్ మెత్’గా పిలిచే యాంఫెటమైన్ అని నిర్ధారణయింది. మొత్తం 11,400 గ్రాముల బరువున్న ఈ నిషేధిత పదార్థాన్ని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం, 1985 కింద సీజ్ చేశారు. నిందితులను అదే చట్టం కింద అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా వ్యవస్థీకృత డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లకు గట్టి దెబ్బ తగిలిందని, భారీ మొత్తంలో ప్రమాదకర మాదకద్రవ్యాలు మార్కెట్లోకి చేరకుండా అడ్డుకున్నామని చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా డ్రగ్ పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



