– టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్
నవతెలంగాణ-అడవిదేవులపల్లి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ పిలుపునిచ్చారు. యాత్ర విజయవంతం కోసం ఆదివారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం పరిధిలోని ముదిమణిక్యం, గోన్య తండా, దుద్య తండా, జిలకర కుంట తండా, కొత్తూరు, చింత చెట్టు తండా, మొల్కచర్ల, చిట్యాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతాంగ సమస్యలు, పోడు భూములు సాగు చేస్తున్న రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ముఖ్యంగా బీజేపీ విధానాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, దానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించడానికి ప్రజలను చైతన్యవంతం చేసేందుకు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం అడవిదేవులపల్లి మండలానికి వస్తుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చైతన్య యాత్రలో పాల్గొంటున్నారని, ఈ యాత్రలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ రవి నాయక్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, మండల కార్యదర్శి జిటంగి సైదులు, శివ, సర్వయ్య, రాంబాబు, కోటి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.