సందేశ్‌ఖాలీ మహిళలతో కలిసి మమతా ర్యాలీ.. మోడీపై విమర్శలు

నవతెలంగాణ – కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మహిళలతో కలిసి కోల్‌కతాలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎంసీ నేతల లైంగిక దాడుల ఆరోపణలతో రగులుతున్న సందేశ్‌ఖాలీ దీవికి చెందిన మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. ‘మహిళల హక్కులు, మా నిబద్ధత’ అన్న నినాదంతో సాగిన ఈ ర్యాలీలో బీజేపీతోపాటు ప్రధాని మోదీని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లో మహిళలను హింసిస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు. బెంగాల్‌లోనే మహిళలు అత్యంత సురక్షితమని, దీనిని తాను నిరూపించగలనని సవాల్‌ చేశారు. కాగా, ప్రధాని మోదీ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినప్పుడు, ఆయన (మోదీ) ఎక్కడ ఉన్నారు?’ అని ప్రశ్నించారు. బిల్కిస్ (బానో)ను మీరు మరిచిపోయారా? అని నిలదీశారు.

Spread the love