– విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి..
– కల్వర్టు నిర్మాణానికి కసరత్తు
– దొంటికుంట చెరువుకు డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు
– వైస్ చైర్మన్ జూపల్లి రమేశ్ బాబు
– కౌన్సిలర్ డా. భూక్యా ఉదయ జ్యోతి
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాలిటీ 14 వ వార్డులో ఏళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక వార్డు కౌన్సిలర్ డా. భూక్యా ఉదయ జ్యోతి చొరవతో వైస్ చైర్మన్ జూపల్లి రమేశ్ బాబు విద్యుత్ అధికారులతో మాట్లాడి విరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు.
వర్షాకాలంలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇరిగేషన్ శాఖ ఏఈ కిషోర్తో వైస్ చైర్మన్ మాట్లాడారు. సమస్య పరిష్కారానికి త్వరలో కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. దొంటికుంట చెరువుకు అనుసంధానంగా ఉన్న లింక్ కాలువల ద్వారా డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ డా. భూక్యా ఉదయ జ్యోతి మాట్లాడుతూ వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో 10 వ వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు, జూపల్లి ప్రమోద్, మోర్ల వెంకన్నబాబు, శ్రీను, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.



