నవతెలంగాణ హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలోనూ అమలు చేయదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ మహమ్మద్ జబ్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీఆర్ఎస్ ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు.
బీజేపీ ఇప్పటికే సీఏఏ అమల్లోకి తెచ్చిందని, మళ్లీ వారు అధికారంలోకి వస్తే ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని, దేశంలో లౌకికవాదాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ను రూ.4 వేల కోట్లకు పెంచుతామని, లోక్సభ ఎన్నికల తర్వాత మైనార్టీలకు సబ్ ప్లాన్ ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందర్రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రామారావు, పురపాలిక ఛైర్పర్సన్ ప్రమీల, బషీర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.