– రాష్ట్రంలో 144 ప్రాంతాల్లో వర్షం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా పడే సూచనలున్నాయని హెచ్చరించారు. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల వరకు 144 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో అత్యధికంగా 2.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.