నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఈరోజు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. 370 రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీం సమర్థించింది. ఈ సందర్భంగా సుప్రీం తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆశాజనకమైన తీర్పు అని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ తీర్పుపై మోడీ ‘ఒకప్పటి రాష్ట్ర (ఇప్పుడు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు) ప్రజల కలలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని పోస్టులో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు నేడు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఆగస్టు 5, 2019న భారత పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థిస్తుంది అని మోడీ అన్నారు. ‘ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్లోని మా సోదర సోదరీమణులకు ఒక ఆశను కల్పించింది. పురోగతితోపాటు, ఐక్యతకు నిదర్శనంగా ఈ తీర్పు ఉంది. సర్వోన్నత న్యాయస్థానం అపారమైన జ్ఞానంతో భారతీయులుగా మనం ఎంతో ప్రేమించే, గౌరవించే ఐక్యత యొక్క సారంశాన్ని బలపరిచింది. ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన మన సమాజంలోని జమ్మూకాశ్మీర్, లడఖ్లోని ప్రజల కలల్ని నెరవేర్చడానికి మేము నిబద్ధతతో కృషి చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు ప్రగతి ఫలాలు అందేలా చూస్తాము. ఈరోజు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు కాదు. ఇది ఒక ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తు యొక్క వాగ్ధానం. బలమైన, మరింత ఐక్యమైన భారతదేశాన్ని నిర్మించాలనే మా సమిష్టి సంకల్పానికి నిదర్శనం.’ అని మోడీ తన పోస్టులో పేర్కొన్నారు.