నవతెలంగాణ- ఢిల్లీ: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ(సోమవారం) సంచలన తీర్పు వెల్లడించింది. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అంతేకాదు.. పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదని స్పష్టం చేసింది. కాశ్మీర్కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం కేవలం వెసులుబాటు కోసం మాత్రమే అని చెప్పింది. మిగతా రాష్ట్రాలకు జమ్మూకశ్మీర్ రాజ్యాంగ హక్కుల విషయంలో ప్రత్యేకత ఏమీ లేదని పేర్కొంది. కేవలం రెండు ఉద్దేశాల కోసం మాత్రమే ఆర్టికల్ 370 ఏర్పాటు అయిందని గుర్తుచేసింది. 1. నాటి ప్రత్యేక పరిస్థితులు 2.యుద్ధం కారణంగానే ఆర్టికల్ను రూపొందించారని తెలిపారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్ సమానమే అని వెల్లడించింది. భారతదేశంలో కాశ్మీర్ వీలినమైనప్పుడు ప్రత్యేక హోదాలు ఏవీ లేవని గుర్తుచేసింది.