సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ తన పిటిషన్‌ను విచారించేలా ఆదేశించాలని కోరారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు అవినాష్‌ తరఫు లాయర్లు ఈరోజు మెన్షన్‌ చేశారు. అయితే అవినాష్‌కు సుప్రీంలో ఊరట దక్కలేదు. విచారణ తేదీని సీజేఐ ధర్మాసనం ఖరారు చేయలేదు. విచారణ అత్యవసరమైతే రాతపూర్వక అభ్యర్థన ఇవ్వాలని.. దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూచించారు.
ఈ హత్య కేసు దర్యాప్తులో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విచారణకు హాజరుకావాలని ఈ కేసులో సహనిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు ఇది వరకే నోటీసులు జారీ చేశారు. అయితే హైదరాబాద్‌లో అందుబాటులోనే ఉన్నా విచారణకు రాలేనని చివరి నిమిషంలో ఆయన సీబీఐకి సమాధానమివ్వడం.. ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ కడపకు బయలుదేరి వెళ్లడం.. అంతే వేగంతో సీబీఐ బృందం కడపకు చేరుకోవడం.. అవినాష్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19న విచారణకు రావాలంటూ డ్రైవర్‌కు నోటీస్‌ ఇవ్వడం లాంటి పరిణామాలు ఉత్కంఠ రేకెత్తించాయి. వివేకా హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. అనూహ్యంగా కొత్త వ్యక్తులు తెర పైకి వస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందోననేది ఉత్కంఠగా మారింది.

Spread the love