నవతెలంగాణ న్యూఢిల్లీ : మణిపూర్ ఘటనపై విచారణకు ముగ్గురు మహిళా న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ షాలినీ పన్సాల్కర్ జోషి, జస్టిస్ ఆషా మీనన్లతో కూడిన కమిటీని నియమిస్తున్నట్టు సీజేఐ డి.వై. చంద్రచూడ్ వెల్లడించింది. ఈ కమిటీ పునరావాసం, పరిహారంపై అధ్యయనం చేయనుందని సీజేఐ తెలిపారు. జస్టిస్ గీతా మిట్టల్ జమ్ము కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ జోషి బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి. జస్టిస్ మీనన్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించి రిటైరయ్యారు. అలాగే సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఓ అధికారిని కూడా నియమిస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో న్యాయ విచారణపై విశ్వసాన్ని జోడిస్తున్నామని పేర్కొంది. విచారణ నివేదికను ఆ అధికారి కోర్టుకు సమర్పించాలని సూచించింది . మహారాష్ట్ర మాజీ డీజీపీ, ముంబయి పోలీస్ కమిషనర్ అయిన దత్తార్రు పద్సల్గికర్ను పర్యవేక్షక అధికారిగా నియమిస్తున్నట్టు వెల్లడించింది.