గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి:
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
పెంబి మండలంలో పాదయాత్ర
సీపీఐ(ఎం)లో భారీగా ప్రజల చేరిక
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్రలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా కోశగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని రావిగూడలో పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి జాన్వెస్లీ పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన మండలంలో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని తెలిపారు. విడతల వారీగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్ర, బైక్ యాత్రలు నిర్వహించడంతో రెండు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం అయిందని చెప్పారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడు ఆర్థిక ఇబ్బందుల్లో సతమ తమవుతున్నాడని అన్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలను తీవ్రం చేస్తోందని చెప్పారు. పెంబి మండలంలో రోడ్డు సౌకర్యం లేక అభివృద్ధి కుంటుపడిందని, అనేక గ్రామాలకు రవాణా, విద్యుత్ సౌకర్యం లేదని తెలిపారు. అటవీశాఖ అనుమతులతో రోడ్డు మార్గంవేసి గిరిజన గ్రామాలకు రవాణ సౌకర్యం మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 234 మంది వివిధ గ్రామాల ప్రజలు సీపీఐ(ఎం)లో చేరగా జాన్వెస్లీ వారికి పార్టీ సభ్యత్వం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడత రవీందర్, జిల్లా కార్యదర్శి గౌతమ్ కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొమ్మెన సురేష్, జిల్లా కమిటీ సభ్యులు తొడసం శంభు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ఉద్యమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



