నవతెలంగాణ హైదరాబాద్: బేగంపేట బాలంరాయిలోని అంబేడ్కర్నగర్లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న హత్య స్థానికంగా కలకలం రేపింది. బేగంపేట పోలీసుల వివరాల ప్రకారం.. బేగంపేట బాలంరాయి సమీపంలోని అంబేడ్కర్నగర్లో బి.రాజు, యాదమ్మ ఉంటున్నారు. ఇంటర్ చదువుతున్న వీరి కుమారుడు తరుణ్(18) మంగళవారం రాత్రి 10 గంటలకు ఓ పాన్ దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడి భుజం తరుణ్కు తగలడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో ఆ యువకుడు తన గదిలో ఉండే మరో ముగ్గురిని అక్కడికి పిలుచుకుని వచ్చాడు. వారు కూడా తరుణ్తో గొడవకు దిగారు. అది ఘర్షణగా మారడంతో నలుగురూ తమ గదికి వెళ్లి కత్తితో వచ్చి తరుణ్ను పొడిచి పరారయ్యారు. తరుణ్ కుప్పకూలిపోవడంతో స్థానికులు తల్లి యాదమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి రక్తపు మడుగులో ఉన్న కుమారుడ్ని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
దీంతో ఆమె బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ జిల్లాకు చెందిన శివశంకర్(24), ఎ.తరుణ్(21), జహీరాబాద్కు చెందిన పండు(22), సాయికిరణ్(21)లు ఘర్షణలో తరుణ్ను కత్తితో పొడిచి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఈ నెల 1వ తేదీనే వీరు అంబేడ్కర్నగర్లో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో సాయికిరణ్ మొదట తరుణ్తో ఘర్షణ పడి మిగిలిన ముగ్గుర్నీ పిలుచుకురావడంతో చిన్న గొడవ కాస్త ఘర్షణగా మారి హత్యకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.