– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్ఐసీ ఏజెంట్ల రక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని సచివాలయం ఎదుట ఉన్న ఎల్ఐసీ జోనల్ కార్యాలయంలో ఏజెంట్లు మహాధర్నా నిర్వహించారు. ఎల్ఐసీ ఏఓఐ జాతీయ నాయకులు సూర్జిత్, సౌత్ సెంట్రల్ జోన్ నాయకులు ఎల్.మంజునాధ్, పిఎల్. నర్సింహారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎల్ జోసఫ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఎల్ఐసీ ఏజెంట్లకు రక్షణ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరారు. బీమా సుగమ్ ఎక్సేంజ్ అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. గ్రాట్యూటీ పెంచి ఏజెంట్స్ మెడీక్లయిమ్ సమస్యలను పరిష్కరించాలనీ, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. బీమా రంగం ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్ఐసీ ఏజెంట్లు సమకూర్చే నిధులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే బీమా రంగాన్ని మరింత బలోపేతం చేయకుండా బహుళ జాతి, విదేశీ ప్రయివేటు ఇన్సూరెన్స్ ప్రయోజనాల కోసం ఎల్ఐసీని నిర్వీర్యం చేయడం అన్యాయమన్నారు. బీమా రంగ పరిరక్షణ కోసం ఎల్ఐసీ ఏజెంట్లు ప్రజలను జాగృతం చేయాలనీ, ఆ పోరాటానికి సీఐటీయూ అండగా ఉంటుందని హామీనిచ్చారు.