ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదు: సీఎం రేవంత్

నవతెలంగాణ – హైదరాబాద్: మంత్రివర్గం విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. కాంగ్రెస్ పెద్దలతో రాష్ట్ర మంత్రివర్గంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. 2024, జూన్ 27వ తేదీ ఢిల్లీలో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఏ శాఖ ఖాళీగా లేదు.. అన్ని శాఖలకు మంత్రులున్నారన్నారు. ప్రస్తుతం విద్యాశాఖను తాను ఫుల్ టైమ్ చూస్తున్నానని. విద్యాశాఖ మీద ఎన్నో సమీక్షలు నిర్వహించానని.. తన ఆధ్వర్యంలో విద్యాశాఖ సక్సెస్ గా పరీక్షలు నిర్వహించిందని చెప్పారు. మీడియాలో ఇష్టారాజ్యంగా కథనాలు వస్తున్నాయని.. మీ పాటికి మీరే శాఖలు కూడా కేటాయిస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు, పత్రికలు మాత్రమే శాఖలకు మంత్రులు లేరని రాస్తున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ ఒక సందర్భంలో ఏ శాఖకూ మంత్రి లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నించారా? అని అడిగారు.
ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా మన రాష్ట్రంలో శాఖల మంత్రుల పనితీరు చాలా మెరుగ్గా ఉందన్నారు. నిరంతరం కేంద్రం చుట్టూ తిరుగుతూ తమ తమ శాఖల పనులు చూసుకుంటున్నాని తెలిపారు. బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను కేంద్రానికి తెలియజేయడం కోసం మేమంతా ఢిల్లీకి వచ్చామన్నారు. ఇందులో భాగంగా కొత్త ప్రభుత్వానికి రాష్ట్ర వినతులు ఇచ్చామన్నారు. ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా కేంద్ర పెద్దలను కలుస్తున్నామని… త్వరలో ప్రధానమంత్రిని, హోం మంత్రిని కూడా కలుస్తామని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడి నియమించమని అధిష్ఠానానికి చేప్పిన
‘‘జీవన్‌రెడ్డి అలక అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయి. కాంగ్రెస్‌ పట్ల ఆయనకున్న నిబద్ధత వారికి అర్థం కాదు. సీనియర్‌ నేత అయిన ఆయన సేవలను పార్టీ వినియోగించుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లు. కొత్త అధ్యక్షుడిని నియమించమని అధిష్ఠానానికి ఇదివరకే చెప్పాను. మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా పరిధిలోనే ఉంది. ఇప్పటివరకు అన్ని పరీక్షలు సవ్యంగానే నిర్వహించా. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. కేసీఆర్‌ ఒక్కరే ప్రమాణస్వీకారం చేసి మంత్రులను నియమించకపోయినా ఆనాడు మీడియా ప్రశ్నించలేదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం. బడ్జెట్‌లో నిధుల కోసం కేంద్రమంత్రులను కలుస్తున్నాం. త్వరలో ప్రధాని మోదీని, కేంద్ర హోంమంత్రిని కలుస్తాం.

Spread the love