నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని మలక్పేట వద్ద మూసీ సమీపంలో మొండెం లేని తల దొరికిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ తల ఓ నర్సుదిగా పోలీసులు గుర్తించారు. ఆరు రోజుల క్రితం మలక్పేటలోని మూసీ పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్ కవరులో మొండెంలేని తల కనిపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించారు. మృతిరాలిని ఎర్రం అనురాధగా ధ్రువీకరించారు. ఆమె సోదరి, బావ గుర్తించడంతో పోలీసులు ఆ తల నర్సు అనురాధదేనని తేల్చారు. ఆమె వడ్డీ వ్యాపారం నిర్వహించేవారని గుర్తించారు. డబ్బుల వ్యవహారంలోనే ఆమె హత్యకు గురైనట్లు నిర్థారణకు వచ్చారు. ఈ కేసులో హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది.