– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్లనే ఇండియా కూటమి చెల్లాచెదురు అవుతున్నదనీ, కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతుందన్నారు. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని తెలిపారు. నిజానికి బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదనీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే దేశంలో బీజేపీని అడ్డుకోగలరని తెలిపారు. బీజేపీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదని విమర్శించారు.