సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సీపీఐ నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన మావోయిస్టు అగ్రనేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో మతోన్మాద, ఫాసిస్టు శక్తులకు అడ్డుకట్ట వేయడం బలమైన కమ్యూనిస్టు ఉద్యమంతోనే సాధ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నొక్కి చెప్పారు. అడవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులంతా మాతృ సంస్థ అయిన సీపీఐలో చేరాలని ఆహ్వానం పలికారు. శనివారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు దేవజీ(టిప్పిరి తిరుపతి),మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), పుల్లూరి ప్రసాద్ రావు (చంద్రన్న) వచ్చారు. సీపీఐ నేతలను మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఐ(ఎం), తదితర వామపక్షపార్టీలతో పాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు అనేక రూపాలలో చేసిన ఆందోళనల గురించి వివరించారు. కమ్యూనిజం పట్ల అభిమానం కలిగిన వారిగా సీపీఐ కార్యాలయానికీ లొంగిపోయిన నేతలు రావాలనుకున్నారనీ, అయితే సమయం కుదరకపోవడంతో ఇప్పుడు వచ్చారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిపి, వారి భవిష్యత్తు ఏమిటనే దానిపై చర్చిస్తామనీ, తమ ఆలోచనలను వారితో పంచుకుని, తెలంగాణకి, దేశానికి మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. త్వరలో అందరం కలిసి మరోసారి చర్చిస్తామని తెలిపారు. దేవ్జీ మాట్లాడుతూ సీపీఐ నేతలను కేవలం మర్యాదపూర్వకంగా కలిసేందుకు మాత్రమే వచ్చామని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టు ఉద్యమంతోనే మతోన్మాద, ఫాసిస్టు శక్తులకు అడ్డుకట్ట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



