విద్యార్థుల ఒత్తిడిని తగ్గించే ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్స్‌

Open Book Exams to reduce student stressసహజంగా పరీక్షలు సమీపిస్తుంటే విద్యార్థుల్లో భయం, ఆందోళన మొదలవుతాయి. ఏడాదిగా చదివిందంతా గుర్తుపెట్టుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కోసారి మొదటి వాక్యం గుర్తుకు రాకపోయినా సమాధానం సరిగా రాయలేరు. రాత్రనక, పగలనక కష్టపడి చదువుకొని పరీక్షహాల్లోకి వెళ్లగానే పరీక్షాపత్రం చూస్తూ ఆత్రుతతో టెన్షన్‌ పడుతూ విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉంటారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల్లో టెన్షన్‌ తగ్గించి, కంఠస్థం (బట్టి పద్ధతి) చేసే విధానానికి స్వస్తి పలికి, పరీక్షలకు పుస్తకాలను తీసుకుని వెళ్లి, చూసి రాసే అవకాశమిస్తే ఎలా ఉంటుందోనని సీబీఎస్సీ ఆలోచిస్తోంది. ఈ ఆలోచనే ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ చర్చను తెరపైకి తీసుకువచ్చింది.
ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌: పుస్తకాలు చూస్తూ పరీక్షలను రాసే పద్ధతిని ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్స్‌ అంటారు. ఈ పరీక్ష విధానంలో సమాధానం రాసేటప్పుడు విద్యార్థులు వారి పుస్తకాలు, స్టడీనోట్స్‌, గైడ్లు ఉపయోగించుకోవడానికి అనుమతి ఇస్తారు.ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌లో విద్యార్థులు ఆమోదింపబడిన స్టడీ మెటీరియల్‌ మాత్రమే అనుమతిస్తే దాన్ని పరిమితి చేయబడిన ఓపెన్‌ బుక్‌ అసెస్మెంట్‌ అని, ఏదైనా సంబంధిత స్టడీ మెటీరియల్‌ ఉపయోగిస్తే అది ఉచిత టైప్‌ ఓపెన్‌ బుక్‌ అసెస్మెంట్‌ అని అంటారు.ఓపెన్‌ బుక్‌ పరీక్షలు ప్రస్తుత పరీక్షలతో పోల్చుకుంటే కఠినంగా ఉంటాయి. ప్రస్తుత పరీక్షా విధానంలో విద్యార్థుల జ్ఞానాన్ని వారి బట్టి పట్టే సామర్థ్యాన్ని మనం పరీక్షిస్తున్నాం. ఓపెన్‌ బుక్‌ పరీక్షల్లో ప్రశ్నలు సాంప్రదాయ పద్ధతిలో వలె నేరుగా ఉండవు పరోక్షంగా విద్యార్థుల అవగాహనా సామర్ధ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. విశ్లేషణ స్థాయినీ అంచనా వేసేలా ఉంటాయి. మూల్యాంకన ప్రక్రియను మార్చడానికి, సమస్యలను సంశ్లేషణ చేయడానికి, విశ్లేషించడానికి విద్యార్థులను సమర్థవంతంగా తయారు చేయడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి విమర్శనాత్మక ఆలోచనలు ప్రోత్సహించడానికి విద్యార్థుల్లో అవగాహనా సామర్ధ్యాన్ని పెంచడానికి ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ ఉపయోగపడుతుంది.ఈ విధానం సృజనాత్మకతతో కూడి, పుస్తకాలతో విస్తారమైన పరిచయం లేకుండా విద్యార్థులు సమాధానాలు రాయలేరు. ఓపెన్‌బుక్‌ పరీక్షలో వచ్చే ప్రశ్నలు విస్తృత పరిధిని కలిగి ఉంటాయి. పుస్తకం ఆమూలాగ్రం చదివి పరీక్ష రాసేలా ఉండదు. ఆ సబ్జెక్టుకి సంబంధించి అనేక పుస్తకాలతో సంబంధం ఉండేలా విస్తృతస్థాయి ప్రశ్నలు ఈ పరీక్షల్లో అడుగుతారు.
బుక్‌ రీడింగ్‌, ఇంటర్నల్‌ డిబేట్‌లకు బాగా అలవాటు పడి ఉంటే ఈ ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ విద్యార్థులకు సులభమవుతుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే టీచర్లు పాఠాలు బోధించే విధానం గతంతో పోల్చుకుంటే చాలా మారిపోయింది. నూతన భావనలకు అవగాహన కల్పించే బదులుగా ఈ ప్రశ్నకు ఇలా జవాబు రాస్తే ఇన్ని మార్కులు వస్తాయి అనే విధంగా విద్యార్థులకు పాఠ్యాంశ బోధన జరుగుతుంది.ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నూతన భావనలపై లోతైన అవగహన లేకుండా పోతుంది. విశ్లేషించి జవాబు రాసే ఆలోచన విద్యార్థుల్లో లోపిస్తుంది.ఓపెన్‌ బుక్‌ పరీక్షలో ప్రశ్నలు విద్యార్థులను ఆలోచింపజేసేలా ఇండైరెక్ట్‌గా ఉంటాయి. జవాబులు రాసేముందు ప్రశ్నలను అర్థం చేసుకుని భావనలపై అవగాహన లేకుంటే సమాధానాలు రాయలేరు. వారు తెచ్చుకున్న పుస్తకాల్లో స్టడీ మెటీరియల్‌లో ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన సమాచారాన్ని వినియోగించుకొని ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుంది.
ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్స్‌ ఎందుకు?: నూతన జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా మూల్యాంకన పద్ధతిని మార్చడం, ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతిని అన్వేషించడం, విద్యార్థుల ప్రయోజనం కోసం వివిధ రకాల పరీక్షలను అమలు చేయాలని సిఫారసు చేసింది. సీబీఎస్సీ సాధారణ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ని అన్వేషిస్తుంది. సీబీఎస్సీ గతేడాది విడుదల చేసిన నేషనల్‌ కరికులం ప్రైమ్‌ వర్క్‌ ఆధారంగా ఈ రకమైన ప్రతిపాదన ను రూపొందించింది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌ వర్క్‌ ప్రస్తుత మూల్యాంకన ప్రక్రియను సంస్కరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. పరీక్షల సంస్కరణలలో భాగంగా ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ విధానాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేసి ఫలితాలను సమీక్షించనుంది సీబీఎస్సీ.
దేశంలో ఓపెన్‌ బుక్‌ పరీక్ష విధానం: 2014లో సీబీఎస్సీ ఓపెన్‌ టెక్స్ట్‌ బేస్డ్‌ అసెస్మెంట్‌ (ఓబిటిఏ)ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా 9, 11 తరగతులలో ఓపెన్‌ బుక్‌ పరీక్షలు నిర్వహించారు. బట్టి పట్టే విధానాన్ని తగ్గించి సమాచార ప్రాసెసింగ్‌ నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకొని అమలు చేసారు. కాని విద్యార్థుల్లో క్రిటికల్‌ థింకింగ్‌ స్కిల్స్‌ పెంచడంలో విపులమయ్యామనే భావనతో 2017-18 విద్యాసంవత్సరంలో దీన్ని నిలిపివేశారు.2019లో ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలలో ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ను అడ్వయిజర్‌ బోర్డ్‌ సిఫారసు చేసిన తర్వాత అనుమతించింది. 2020-21 కరోనా సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఇండోర్‌, ఐఐటి బాంబే, కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులను మూల్యాంకనం చేయడానికి ఓపెన్‌ బుక్‌ టెస్టులను నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ ప్రయోగం 2021-22లో తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్‌ పరీక్షలకు ఈ విధానం అమలు చేసి సత్ఫలితాలను పొందింది. అప్లైడ్‌ ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌లో పాస్‌ పర్సంటేజ్‌ 24 శాతం పెరిగింది.కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల్లో అంతర్గత మూల్యాంకనం కోసం ఈ ఓపెన్‌ బుక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రయోజనాలు: ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ విద్యార్థులకు ముఖ్యమైన భావనలు, హై ఆర్డర్‌ స్కిల్స్‌, సెల్ఫ్‌ అసెస్మెంట్‌పై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది. క్లిష్టమైన సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. బోర్డ్‌ ఎగ్జామ్‌ ఆధారంగా నడిచే కోచింగ్‌ పరిశ్రమ విస్తరణను నిరోధిస్తుంది. వనరుల నిర్వహణ నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. విద్యార్థుల్లో పరీక్షకు సంబంధించిన ఒత్తిడిని తగ్గిస్తుందని ఆల్‌ ఇండియా ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ భువనేశ్వర్‌కు చెందిన వైద్య విద్యార్థులతో జరిపిన అధ్యయనంలో తేలింది. విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. పరీక్షలు స్వేచ్చగా ఎలాంటి ఒత్తిడి లేకుండా రాస్తారు.
సీబీఎస్సీ పైలెట్‌ ప్రాజెక్టు: నేషనల్‌ కరికులం ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్సీ) 9 నుండి 12వ తరగతి విద్యార్థులకు ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని పరీక్షించనుంది. ఈ పైలట్‌ ప్రాజెక్టులో 9, 10వ తరగతి లకు ఇంగ్లీష్‌, గణితం, సైన్స్‌, 11 తరగతిలకు ఇంగ్లీష్‌, గణితం, జీవశాస్త్రం కోసం ఓపెన్‌ బుక్‌ పరీక్షలు ఉంటాయి.జూన్‌ నాటికి సీబీఎస్సీ పైలట్‌ ప్రాజెక్టు రూపకల్పన, అభివృద్ధి ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సహాయ సహకారాలు తీసుకోవాలని నిర్ణయించింది.నవంబర్‌, డిసెంబర్‌లో ఎంపిక చేసిన బడుల్లో ఈ పైలట్‌ ప్రాజెక్టు ద్వారా ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ నిర్వహించనుంది సీబీఎస్సీ.వచ్చే ఫలితాలను విశ్లేషించి ఈ పరీక్షా విధాన అమలుపై నిర్ణయం తీసుకోనుంది.
ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ అంటే కాపీ కొట్టే విధానం కాదని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలి. పాఠ్యాంశాలలోని భావనలను అవగాహన చేసుకొని లోతైన అధ్యయనం చేస్తేనే ఈ పరీక్షా విధానంలో విద్యార్థులు సరైన జవాబులు రాయగలరు.రాబోయే తరాల భవిష్య త్తును దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీపడేలా సీబీఎస్సీ పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫలితాల ఆధారంగా మరింత అధ్యయనం చేసి ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫిన్లాండ్‌, సింగపూర్‌, ఇంగ్లాండ్‌, అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వివిధ పరీక్షల్లో ఈ ఓపెన్‌ బుక్‌ ఎగ్జామ్‌ అమలు చేసి సత్ఫలితాలు పొందుతున్నాయి.

– పాకాల శంకర్‌ గౌడ్‌
9848377734

Spread the love