‘చేతిలో సెల్‌ – హెల్‌లో హెల్త్‌’

నేటి ప్రపంచానికి పెను సవాలుగా పరిణిమించిన నూతన నిశబ్ద సమస్య సెల్‌ వినియోగం. ఎంతో మందికి దోహదం చేస్తుంది అని భావించిన సెల్‌ఫోన్‌ నేడు ఇదో పెద్ద హెల్‌ ఫోన్‌గా మారుతుంది. ముఖ్యంగా యువత జీవితాలను ప్రభావితం చేస్తోంది. శారీరక మానసిక అనారోగ్యాలకు కారణమవుతున్నది. మనదేశంలో సగటున యువత రోజుకు 9గంటలకు పైగా సెల్‌ వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 5 గంటలు దాటి సెల్‌ఫోన్‌ వాడితే ”సెల్‌ అడిక్షన్‌”గా భావించాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 8-12 సంవత్సరాల పిల్లలు రోజుకు 8గంటలు సెల్‌ఫోన్‌ వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో 4.7శాతం జనాభా రోజుకు 9గంటలు పైబడి సెల్‌ఫోన్‌ మత్తులో జోగుతున్నారు. దీంతో భవిష్యత్తులో యువత శారీరక, మానసిక అసహజ లక్షణాలతో అనారోగ్యాలకు గురవుతున్నారు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో భారత్‌లో ప్రజలు 12శాతం సెల్‌ఫోన్‌కు అడిక్టెడ్‌గా మారనున్న నేపథ్యంలో ఇకనైనా తల్లిదండ్రులు తమ పిల్లల సెల్‌ఫోన్‌ వినియోగంపై దృష్టి సారించాలి. లేకపోతే పెను అనారోగ్యాలకు తోపాటు, చెడు ప్రభావాలకు గురయ్యే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే బ్రిటన్‌లో 10శాతం జనాభా సెల్‌ఫోన్‌ అడిక్టెడ్‌ అయ్యారని సమాచారం. సెల్‌ఫోన్‌ వినియోగంతో ప్రపంచ కుగ్రామంగా మారి, అనేక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు మనకు అందుబాటులోకి వచ్చాయి. కానీ అదే సమయంలో యువత, పిల్లలు సోషల్‌ మీడియాలో సంచరిస్తూ వారి భవిష్యత్తును పణంగా పెట్టడం వలన కెరీర్‌ పాడుచేసుకుంటున్నారు. కరోనా కాలంలో ”ఆన్‌లైన్‌ చదువులు” పేరిట సెల్‌ఫోన్‌ ప్రతీ ఒక్కరికీ చేరువైంది. ముఖ్యంగా విద్యార్థుల చేతిలో ఆయుధంగా మారింది. చదువుల మాట అలా ఉంచితే, ఎక్కువ మంది వీడియో గేమ్స్‌, రకరకాల వెబ్‌ సైట్లు చూస్తూ కాలక్షేపం చేయటం జరుగుతుంది. దీంతో చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల అలవాట్లు, స్నేహాలపై శ్రద్ధ పెట్టకపోవడం పెద్దలోపం. తల్లిదండ్రులతో కలిసి ఉన్నా ఎవరి సెల్‌ఫోన్‌తో వారు కాలక్షేపం చేయడంతో వారి మధ్య ఉండే ప్రేమ, అనురాగం, మానవీయ, కుటుంబ సంబంధాలు క్షీణించి చివరికి ఒంటరి జీవితాలుగా దుర్భరం అవుతున్నాయి. చివరికి ”పెళ్ళిళ్ళు వద్దు, ఒంటరి జీవితాలు ముద్దు” అనే స్థాయికి నేటి యువత దిగజారడం బాధాకరమైన విషయం… అలాగే ఇతరులు వ్యక్తిగత జీవితంలో ప్రవేశించి, అనేక జీవితాలను అస్తవ్యస్తం చేయడం జరుగుతుంది. వివాహే తర సంబంధాలు, సైబర్‌ క్రైమ్‌, టెర్రరిజం, మత్తు దందాలకు సెల్‌ఫోన్‌ ఆలంబనగా మారుతోంది. ఫేక్‌ న్యూస్‌, ఫ్లాష్‌ న్యూస్‌ వంటి సమాచారాలతో తప్పుడు ప్రచారం చేయడం సమాజంలో రకరకాల ఉద్రిక్తతలకు కారణం అవుతుంది. ఆపదలో ఉన్నవారిని అందుకోవడంలో ముఖ్యంగా కరోనా కాలంలో సెల్‌ఫోన్‌ ఎంతో ఉపయోగపడింది. సరైన పద్ధతిలో వాడకపోతే అంతకంటే ప్రమాదాలకు కారణం అవుతుందని అందరూ గ్రహించాలి. వాట్సప్‌, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో సంచరిస్తున్న పిల్లలు, యువత తమ కెరీర్‌ మలచుకోవడంలో ఈ నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తమ జీవితాలను తీర్చి దిద్దుకోవాలి. ఇప్పటికే కొంతమంది సృజనాత్మకతతో ముందుకు సాగటం అభినందనీయం. అయితే, ఎక్కువ మంది సెల్‌ దుర్వినియోగం చేస్తున్నారు. బాత్‌రూంలో కూడా నూటికి 40శాతం మంది, పడుకునే వరకు 71శాతం మంది సెల్‌ వాడకం చేస్తున్నారు అని సమాచారం. దీంతో శారీరక మానసిక అశాంతికి లోనవుతున్నారు. ముఖ్యంగా తరచూ చికాకు , కోపానికి గురవుతున్నారు. సెల్‌ఫోన్‌ వినియోగం కూడా చట్టానికి అనుగుణంగా ఉండాలి. లేనట్లయితే శిక్షలకు గురయ్యే పరిస్థితి ఉంది అని ప్రతీ వినియోగదారులు గ్రహించాలి. ఫేక్‌న్యూస్‌, వివక్షత, ఉద్రిక్తతలకు కారణం అయ్యే సమాచారం, విద్వేష ప్రసంగాలు ప్రసారం చేయరాదు. ఫార్వర్డ్‌ చేయరాదు. ప్రభుత్వం నిషేధించిన వెబ్‌సైట్లు, యాప్‌లు, వ్యక్తులు, సంస్థలతో సంబంధాలు కలిగి ఉండరాదు. ముఖ్యంగా మనకు తెలియని వారితో సమాచార సంబంధాలు కలిగి ఉండరాదు. ఏమైనా తప్పుడు సమాచారం, బెదిరింపులు మన దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. అవసరమైన న్యాయపరమైన సలహాలు సూచనలు తీసుకోవాలి. ”నేటి బాలలే రేపటి పౌరులు” అని అంటారు. నేటి తరాన్ని సక్రమ మార్గంలో పయనించడానికి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి, మంచి మేధావులుగా తయారవడానికి తల్లిదండ్రుల బాధ్యత. ఉపాధ్యాయులు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు తమదైన రీతిలో కీలక పాత్ర వహించాలి. అప్పుడే భవిష్యత్తు దేశ నిర్మాణానికి తగిన కృషి చేసినవారమవుతాం. -ఐ.పి.రావు

Spread the love