రాత్రికి రాత్రి లక్షాధికారులైన

– పదకొండు మంది మహిళలు..
తిరువనంతపురం : కేరళకు చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం అనూహ్యంగా వరించింది. రాత్రికి రాత్రి వారందరూ లక్షాధి కారులయ్యారు. రూ.250ల లాటరీ టిక్కెట్టును వీరు కొనుగోలుచేయగా… రూ.10 కోట్లు గెలుచుకున్నారు. పరప్పనన్‌గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన ఈ మహిళలు స్థానికంగా నాన్‌ బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలిస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం, వారి కుటుంబాలకున్న ఏకైక ఆదాయ వనరు. ఇటీవల టిక్కెట్టు కొనుక్కునే సమయానికి వారి వద్ద కనీసం పాతిక రూపాయలు కూడా లేని పరిస్థితి. దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంటు లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మానసూన్‌ బంపర్‌ లాటరీ దక్కింది. దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామనీ, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు.

Spread the love